తెలంగాణ

telangana

వినిట్సియాపై విరుచుకుపడ్డ రష్యా.. 23 మంది మృతి..100 మందికి గాయాలు

By

Published : Jul 15, 2022, 8:00 AM IST

సెంట్రల్‌ ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసింది రష్యా. కీవ్‌కు 268 కిలోమీటర్ల దూరంలోని వినిట్సియా నగరమే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 23 మంది మృతి చెందగా.. 100 మందికి గాయాలయ్యాయి.

ukraine russia
ukraine russia

యుద్ధానికి కొద్దిరోజులు కాస్తంత తెరిపి ఇచ్చిన రష్యా.. గురువారం సెంట్రల్‌ ఉక్రెయిన్‌పై భీకరంగా దాడిచేసింది. కీవ్‌కు 268 కిలోమీటర్ల దూరంలోని వినిట్సియా నగరమే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. నల్లసముద్రంలోని జలాంతర్గామి నుంచి ప్రయోగించిన కాలిబర్‌ క్రూయిజ్‌ క్షిపణులు.. పలు భవనాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ధాటికి 23 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మరో 39 మంది ఆచూకీ లభ్యం కావడం లేదని పోలీసులు తెలిపారు. క్షిపణుల ధాటికి ఓ పార్కింగ్‌ స్థలంలో మంటలు చెలరేగి 50 కార్లు దగ్ధమయ్యాయి. తాజా దాడిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. కనీస సైనిక నీతి పాటించకుండా, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడిచేసిందని, ఇది కచ్చితంగా ఉగ్రచర్యేనని పేర్కొన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌లోనూ పుతిన్‌ సేనలు దాడులను కొనసాగించాయి.

రంగంలోకి డ్రోన్ల సైన్యం..:మునుపెన్నడూ లేనంతగా ఈ యుద్ధంలో సైనిక, నిఘా డ్రోన్ల వినియోగం ఎక్కువగా ఉంది. అత్యాధునిక డ్రోన్లను సమకూర్చుకోవడంలో ఉక్రెయిన్‌, రష్యాలు తలమునకలయ్యాయి. పుతిన్‌ సేనలకు ఇరాన్‌ వీటిని సరఫరా చేస్తుండగా.. 'ఆర్మీ ఆఫ్‌ డ్రోన్స్‌' పేరుతో ఉక్రెయిన్‌ నిధులను సమీకరిస్తోంది. "మాస్కో డ్రోన్ల సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే.. ఉక్రెయిన్‌కు సుమారు 2 వేల నాటో గ్రేడ్‌ సైనిక డ్రోన్లు అవసరం. అయితే, ప్రస్తుతానికి 200 డ్రోన్లను మాత్రమే కొనాలని భావిస్తున్నాం" అని సీనియర్‌ అధికారి యూరి షిగోల్‌ చెప్పారు. రష్యా యుద్ధ నేరాలపై విచారణ చేపట్టేందుకు అవసరమైన అంతర్జాతీయ సహకారం నిమిత్తం.. ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు 'ఉక్రెయిన్‌ అకౌంటబులిటీ కాన్ఫరెన్స్‌' నిర్వహిస్తోంది.

విచారణకు హాజరైన బ్రిట్నీ గ్రైనర్‌:మాదక ద్రవ్యాలను తరలిస్తోందన్న ఆరోపణలపై అరెస్టు చేసిన అమెరికా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి బ్రిట్నీ గ్రైనర్‌ను.. విచారణ నిమిత్తం రష్యా అధికారులు గురువారం కోర్టులో హాజరుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details