తెలంగాణ

telangana

ఆస్పత్రిలో చేరిన నటి కుష్బూ.. ఏమైంది?

By

Published : Apr 7, 2023, 5:37 PM IST

Updated : Apr 7, 2023, 7:19 PM IST

సీనియర్​ నటి కుష్బూ సుందర్​ ఇటీవలే తీవ్ర జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు తెలియజేశారు.

khushbu-sundar-hospitalised-due-to-high-fever
khushbu sundar

కోలీవుడ్​ సీనియర్‌ నటి కుష్బూ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్​ వేదిక ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటోలను షేర్‌ చేసి తన ఆరోగ్య పరిస్థితి వివరించారు.

"జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం నన్ను చాలా వేధిస్తున్నాయి. అదృష్టవశాత్తు నేను మంచి ఆసుపత్రిలో చేరాను. ఆరోగ్యం కొంచెం బాగోకపోయినా దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. అలా పట్టించుకోకపోతే కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది" అని ట్వీట్‌ చేశారు. ఈ పోస్ట్​ చూసిన అభిమానులు ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు కీర్తి సురేశ్‌, నిక్కీ గల్రానీ, రాశీ ఖన్నా, శ్రియ, శ్రీదేవి విజయ్‌కుమార్‌ లాంటి ప్రముఖులు కూడా ఈ పోస్ట్​పై స్పందించారు.

అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీల్లో పలు సినిమాలు చేసి తనకంటూ ఓ స్టార్​డమ్​ను తెచ్చుకున్నారు కుష్బూ. నటిగానే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2010లో డీఎంకే పార్టీలో చేరిన కుష్బూ.. ఆ తర్వాత నాలుగేళ్లకు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్​లోనే ఉన్న ఆమె.. 2020లో బీజేపీలో చేరారు. అయితే 2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవి చూశారు.

ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవి చేపట్టారు. రాజకీయాల్లో ఉంటూనే సినీ ఇండస్ట్రీలో సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ దూసుకెళ్తున్నారు నటి కుష్బూ. తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారు. గత ఏడాది శర్వానంద్​ హీరోగా తెరకెక్కిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. రీసెంట్​గా గోపీచంద్ 'రామబాణం' సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. ఈటీవీలో ప్రసారమౌతున్న జబర్దస్త్ కామెడీ షోకు జడ్జీగా కూడా వ్యవహరిస్తున్నారు.

లైంగిక వేధింపులకు పాల్పడ్డ తండ్రి..
మార్చి 8న ఝార్ఖండ్​లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. జాతీయ మహిళా కమిషనర్​ సభ్యురాలిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా ఆమె మహిళలపై జరిగిన వేధింపులపై పెదవి విప్పారు. తన తండ్రి వల్ల తాను ఎనిమిదేళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు తాను ఏమాత్రం సిగ్గుపడటంలేదు అని మీడియాతో తెలిపారు.

Last Updated : Apr 7, 2023, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details