తెలంగాణ

telangana

పదో తరగతికి అటెండర్‌... డిగ్రీకి జూనియర్‌ అసిస్టెంట్‌

By

Published : Apr 24, 2022, 9:10 AM IST

Job Frauds: ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే వారి ప్రతిభ చూస్తారు కానీ.. డబ్బులు కట్టించుకుని ఉద్యోగం ఇవ్వాలని ఏ సంస్థ భావించదు. ఈ చిన్న లాజిక్​ను ఎలా మరిచిపోతారో ఏమో.. డబ్బులిచ్చి ఉద్యోగం కొనుక్కోవచ్చనుకుంటారు కొందరు అమాయకులు. అలాంటి నిరుద్యోగుల ఆవేదనను ఆసరాగా చేసుకుని వారికి ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తరచూ ఎక్కడో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Job Frauds
Job Frauds

Job Frauds: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. రూ.లక్షల్లో డబ్బుగుంజాడు నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో బాధితులంతా నిలదీయడంతో తిరిగిచ్చేస్తానంటూ నమ్మబలికాడు. బాధితులు నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఉన్నారు. రెండేళ్ల క్రితం నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలానికి చెందిన యువకుడికి నిజామాబాద్‌కు చెందిన ఓ అర్చకుడితో పరిచయం ఏర్పడింది. సచివాలయంలోని హోంశాఖ కార్యదర్శి కార్యాలయంలో పనిచేస్తున్నానని చెప్పాడు. ఫోన్‌ నంబరు ఇచ్చాడు. ఏడాది కిందట యువకుడు అర్చకుడికి ఫోన్‌ చేసి రెవెన్యూశాఖలో ఉద్యోగాలు ఉన్నాయన్నాడు. ‘మా సార్‌లు.. వీటిని భర్తీ చేస్తుంటారు. నాకున్న పరిచయాలతో ఉద్యోగం ఇప్పిస్తాను.. ఎవరైనా ఉంటే చెప్పండని’ అడిగాడు. పంతులు తన కొడుకు, కూతురుతో పాటు తెలిసిన వారిని అతడికి పరిచయం చేశాడు. వీరందరూ సదరు వ్యక్తితో మాట్లాడారు.

హైదరాబాద్‌లో ధ్రువపత్రాల పరిశీలనంటూ.. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అటెండరు ఉద్యోగానికి, ఇంటర్‌, డిగ్రీ పాసైన వారితో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేయించాడు. అటెండరు ఉద్యోగానికి రూ.2.5 లక్షలు.. జూనియర్‌ అసిస్టెంట్‌కు రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని చెప్పాడు. ముందుగా సగం ఇవ్వాలన్నాడు. నిజామాబాద్‌ జిల్లాలో అర్చకుడికి తెలిసిన 16 మంది నగదు చెల్లించారు. వీరిలో ఫోన్లు చేసి ఒత్తిడి చేసిన వారికి డిసెంబరులో ధ్రువపత్రాల పరిశీలన ఉందని దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హోటల్‌ వద్ద కలిసి.. ధ్రువపత్రాలు తీసుకొన్నాడు. పది రోజుల తర్వాత తిరిగిచ్చేశాడు. ఒక్కో కుటుంబంలో ఇద్దరేసి చొప్పున రూ.2.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించారు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులందరూ శుక్రవారం నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని నిందితుడి ఇంటికెళ్లారు. నిందితుడు హైదరాబాద్‌లోనే ఉన్నాడని తండ్రి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:స్విగ్గీ బ్యాగ్​లో గంజాయి.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్​..!

ABOUT THE AUTHOR

...view details