తెలంగాణ

telangana

Honor Killing in Sangareddy: ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసిన తల్లి

By

Published : Feb 17, 2022, 12:44 PM IST

Updated : Feb 17, 2022, 2:21 PM IST

Honor Killing in Sangareddy: నవమాసాలు మోసి... కని పెంచిన ఆ తల్లే కూతురి పాలిట యమపాశంలాగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకుంటూ... కంటిపాపలా కాపాడుకోవాల్సిన ఆమే... బిడ్డ ఉసురు తీసింది. మమతకు మారుపేరైన కన్నతల్లి.. వేరే సామాజిక వర్గం యువకుడిని ప్రేమించిందన్న కారణంతో తన గారాలపట్టీని మట్టుబెట్టింది. తన ప్రియుడితో కలిసి కుమార్తెను హతమార్చి... ఆపై వేరే వ్యక్తిపై నేరం మోపేందుకు యత్నించింది. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికింది.

Honor Killing in Sangareddy, huggelli murder case
ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసిన తల్లి

Honor Killing in Sangareddy : ‘ప్రేమ పేరుతో పరువు తీస్తోంది...ఇతర సామాజిక వర్గానికి చెందినవాడితో తగదని వారించినా మార్పులేదని’ భావించిన కసాయి తల్లి కన్న కూతురునే ప్రియుడితో కలిసి హత్యచేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం హుగ్గెలిల్లో సోమవారం సంచలనం రేకిత్తించిన దళిత మైనర్‌ బాలిక హత్య ఘటనలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఈ సందర్భంగా గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఘటన వివరాలను డీఎస్పీ శంకర్‌ రాజు, సీఐ రాజశేఖర్‌ వెల్లడించారు.

వివరాలను వెల్లడించిన పోలీసులు
పది రోజుల ముందే ప్రణాళిక..కూతురును హత్య చేసేందుకు తల్లి బుజ్జమ్మ తన ప్రియుడు నర్సింహులుతో పది రోజులు ముందే ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఆదివారం రాత్రి కూతురు(16)ను హత్య చేసేందుకు నిర్ణయించుకున్న తల్లి, ఆమె ప్రియుడు మద్యం తాగారు. కూతురు ప్రేమిస్తున్న అదే గ్రామానికి చెందిన ఫకీర్‌ అఫ్సర్‌ (24)..‘మామిడి తోటలో ఉన్నాడు. మాట్లాడి నీ సమస్య పరిష్కరించుకుందామని’ తల్లి అక్కడి తీసుకెళ్లింది. పథకం ప్రకారం అప్పటికే అక్కడికి చేరుకున్న నర్సింహులు ప్రేమ మానుకోవాలని బాలికపై ఒత్తిడి తెచ్చారు. వారి మాటలు వినకుండా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో తల్లి కాళ్లపై కూర్చోగా నర్సింహులు బాలిక మెడలోని చున్నీని గొంతుకు బిగించి హత్య చేశారు.నమ్మించేందుకు మెత్తల అబద్ధం.. రాత్రి పదకొండు గంటల తర్వాత కూతురు తనకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. ఇంట్లో పడుకున్నట్లు మెత్తలు పేర్చి దానిపై దుప్పటి కప్పినట్లు బుజ్జమ్మ ఇరుగు పొరుగును నమ్మించేందుకు అబద్దాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాలికను ప్రేమించిన వ్యక్తింపై నేరం మోపేలా హత్య ఘటన స్థలంలో తల్లి కన్నీరు మున్నీరై విలపించింది. అనుమానంతో పోలీసులు అఫ్సర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం బాలిక, ఆమె తల్లి చరవాణి కాల్‌ డేటా సహా హత్య జరిగిన చోట సిగ్నళ్ల సాంకేతిక ఆధారంగా నిందితుడు నర్సింహులును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటను ప్రతిష్ఠాత్మకంగా భావించి నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ రవిగౌడ్‌, శ్రీకాంత్‌లను డీఎస్పీ అభినందించారు. తల్లి బుజ్జమ్మ (45) ఆమె ప్రియుడు ఖాసీంపూర్‌ గ్రామానికి చెందిన గొల్ల నర్సింహులు (48)లను బుధవారం అరెస్టు చేశారు. ఏ-1గా నర్సింహులును చేర్చిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తల్లిని ఏ-2గా చూపుతూ హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Last Updated :Feb 17, 2022, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details