తెలంగాణ

telangana

రూ.20వేల కోట్ల బ్యాంకు స్కామ్​.. ఏబీజీ షిప్​యార్డు వ్యవస్థాపక ఛైర్మన్​ అరెస్ట్​

By

Published : Sep 21, 2022, 9:22 PM IST

Updated : Sep 21, 2022, 9:59 PM IST

ABG Shipyard Scam

వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణం ఎగవేత కేసులో ఏబీజీ షిప్‌యార్డ్‌ వ్యవస్థాపకుడు రిషి కమలేష్‌ అగర్వాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. విచారణకు హాజరైన రిషి కమలేష్‌ అగర్వాల్‌.. దర్యాప్తునకు సహకరించలేదని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వన్నందున అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

ABG Shipyard Scam: దేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్‌ మోసంగా నిలిచిన ఏబీజీ షిప్‌యార్డ్‌ వ్యవహారంలో కీలక ముందుడుగు పడింది. ఆ కంపెనీ వ్యవస్థాపక ఛైర్మన్‌ రిషి కమలేశ్‌ అగర్వాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్‌ చేసింది. రూ.22,842 వేల కోట్ల మేర బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో ఈ అరెస్ట్‌ జరిగింది. రిషి కమలేశ్‌ అగర్వాల్‌పై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద.. నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, అధికార స్థానం దుర్వినియోగం వంటి అభియోగాలను మోపింది.

షిప్పుల తయారీ, రిపేర్‌ వ్యవహారాలను చూసే గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ బ్యాంకుల్ని రూ.23వేల కోట్ల మేర మోసగించింది. ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలోని 28 బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద రుణంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. అయితే, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ అనే సంస్థ నిర్వహించిన ఆడిట్‌లో కీలక విషయాలు వెలుగుచూశాయి. రుణాలుగా తీసుకున్న మొత్తాలను అక్రమ కార్యకలాపాలకు, నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిపింది. దీనిపై బ్యాంకులు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ ఏడాది మొదట్లో రిషి అగర్వాల్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది. తాజాగా అరెస్ట్‌ చేసింది. 2016లో బ్యాంకులు ఈ రుణాన్ని ఎన్‌పీఏగా గుర్తించగా.. 2019లో ఈ మోసం వెలుగుచూసింది.

ఇవీ చదవండి:డబ్బే డబ్బు.. అదానీ సంపాదన రోజుకు రూ.1,600 కోట్లు.. మొత్తం ఎంతంటే?

డిజిటల్​ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ

Last Updated :Sep 21, 2022, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details