డిజిటల్​ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ

author img

By

Published : Sep 21, 2022, 7:55 AM IST

fintech-industry-needs-to-work-relentlessly-on-safety-to-uphold-peoples-trust-pm-modi

Modi On Fintech Industry : దేశంలోని ఫిన్​టెక్​ రంగం మరింత పెరిగేలా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ప్రధాని సందేశాన్ని చదివి వినిపించారు అడ్వయిజరీ బోర్డ్‌ ఛైర్మన్‌ క్రిష్‌ గోపాలకృష్ణన్‌ .

Modi On Fintech Industry : డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) రంగం నిరంతరాయంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలకు ఉదాహరణగా ఈ రంగం నిలుస్తుందని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ (జీఎఫ్‌ఎఫ్‌) సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

ప్రధాని సందేశాన్ని జీఎఫ్‌ఎఫ్‌ 2022 అడ్వయిజరీ బోర్డ్‌ ఛైర్మన్‌ క్రిష్‌ గోపాలకృష్ణన్‌ చదివి వినిపించారు. 'జన్‌ ధన్‌- ఆధార్‌- మొబైల్‌ (జేఏఎం), యూపీఐ విజయవంతం ద్వారా మన జీవితంలో డిజిటల్‌ చెల్లింపులు భాగమయ్యాయి. ఫిన్‌టెక్‌, అంకురాల విభాగంలో ఆవిష్కరణలకు, పెట్టుబడులకు అంతర్జాతీయ ప్రధాన కేంద్రంగా భారత్‌ అవతరించేందుకు ఇది దోహదం చేస్తుంద'ని మోదీ తెలిపారు. నాణ్యమైన ఆర్థిక సేవల ద్వారా నిరుపేదలను కూడా ఆర్థిక సాధికారత దిశగా నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు.

2022-23లో భారత వృద్ధి 7%: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పాటు దశాబ్దం పాటు భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ వెల్లడించారు. జనవరి అంచనా 8 శాతం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కొవిడ్‌-19 పరిణామాల ప్రభావం ఇంకా ప్రపంచంపై కొనసాగుతోందని, దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం లాంటివి వృద్ధికి అవరోధంగా నిలుస్తున్నాయని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అన్నారు. సామాన్యుల బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగించి వారికి రుణాలు, బీమా లాంటి సేవలు అందించడంపై ఈ దశాబ్దకాలంలో ప్రభుత్వం దృష్టి సారించనుందని చెప్పారు.

రుణ యాప్‌లు నిబంధనలు పాటించాల్సిందే : రుణ యాప్‌ నిర్వాహకులకు జరిమానా విధించాలనో, లేదా వాటి అభివృద్ధిని అడ్డుకోవాలనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనకోవడం లేదని.. అవి నిబంధనలను పాటించాలనే కోరుకుంటోందని ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ చెప్పారు. 'ఆన్‌లైన్‌ ద్వారా రుణాలు ఇచ్చే విధానానికి (డిజిటల్‌ లెండింగ్‌) ఆర్‌బీఐ మద్దతు కొనసాగిస్తుంది. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే.. మీతో చర్చించేందుకు మేం రెండు అడుగులు ముందుకు వేసేందుకు సిద్ధం. అయితే కొత్త విధానాలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించాలి. వినియోగదారుకి ప్రయోజనకారిగా ఉండాలి' అని దాస్‌ అన్నారు.

ఇదీ చదవండి: 'హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. ఆ సంస్థే కారణం'

సీఎంకు షాక్!.. విమానం నుంచి దించేసిన ఘటనపై కేంద్రం నజర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.