తెలంగాణ

telangana

Corona Pandemic: ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిద్దామిలా..

By

Published : Sep 10, 2021, 9:51 AM IST

ఆర్థికంగా ఇప్పుడు ఎక్కడున్నాం..? కొన్నాళ్ల తర్వాత ఎలా ఉంటాం..? ఈ సమీక్ష నిరంతరం సాగుతూనే ఉండాలి. ఇటీవల కరోనా సంక్షోభం (Corona Pandemic) తర్వాత చాలామంది ఆర్థిక ప్రణాళికలు దెబ్బతిన్నాయి. అయితే, వీటిని సాధ్యమైనంత వేగంగా దారిలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఏం చేయాలో చూద్దామా?

Corona Pandemic
Corona Pandemic

కరోనా సంక్షోభంతో (Corona Pandemic) ఆర్థిక పరిస్థితిలో ఊహించని మార్పులొచ్చాయి. ఆర్థిక బలాలు, బలహీనతలపై దృష్టి సారిస్తూ అప్రమత్తంగా ఉంటేనే అనుకున్న ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకు కావాల్సిన ప్రణాళికలేంటో మీరూ తెలుసుకోండి..

అత్యవసర నిధితో..

కరోనా లాక్‌డౌన్‌ పరిణామాల నేపథ్యంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు చూశాం. చాలామంది తమ దగ్గరున్న అత్యవసర నిధి నిల్వలను వాడుకున్నారు. పరిస్థితులు కాస్త సర్దుకున్నా.. పూర్తిగా కుదుటపడ్డాయని చెప్పలేం. కాబట్టి, ఖర్చయిన నిధిని జమ చేసేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక నిపుణులు చెప్పే సలహా ప్రకారం కనీసం 3 నుంచి గరిష్ఠంగా 6 నెలల వరకూ సరిపోయే ఖర్చులతో అత్యవసర నిధి ఉండాలి. దీన్ని ఒకేసారి పోగు చేయలేం కాబట్టి, క్రమానుగతంగా పెట్టుడులు పెట్టాలి. ఖర్చు చేసిన తర్వాత పొదుపు చేయడం కాకుండా.. పొదుపు చేసిన తర్వాత ఖర్చు చేయడం అనే నియమం పెట్టుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.

అప్పుల సంగతేమిటి?

మహమ్మారి సమయంలో ఖర్చులను వెళ్లదీయడానికి కొందరు అప్పులను ఆశ్రయించారు. ఇందులో బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్‌ కార్డుల వాడకం.. ఏదైనా సరే.. అప్పులు మనల్ని బాధించకుండా చూసుకోవాల్సిందే. ఒకసారి మొత్తం అప్పులు ఎంతున్నాయన్నది చూసుకోండి. వాటిని ఒకేచోటకు మార్చేందుకు ఏదైనా అవకాశం ఉందా పరిశీలించండి. ఉదాహరణకు గృహరుణం మీద టాపప్‌లాంటివి చూడండి. దీనివల్ల వడ్డీ భారం తక్కువగా ఉంటుంది.

ఆలస్యం చేయొద్దు..

క్రెడిట్‌ కార్డులు లేదా రుణ వాయిదాలను సకాలంలో చెల్లించేందుకు ప్రయత్నించాలి. ఆలస్యం అయితే.. రుసుములు భరించక తప్పదు. ఇది కొనసాగుతూ ఉంటే.. కొన్నాళ్లకు ఈ రుసుములు మరింత భారం అవుతాయి. ఒకవేళ కొన్ని వాయిదాలు చెల్లించలేని పరిస్థితి వస్తే.. ముందుగానే బ్యాంకును సంప్రదించడం మేలు. దీనివల్ల తాత్కాలికంగా రుణ వాయిదాల నుంచి ఉపశమనం దొరికేందుకు వీలుంటుంది.

వీటిని నిర్లక్ష్యం చేయొద్దు..

కొవిడ్‌ తర్వాత ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు చాలామంది ఈ పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పాలసీ ఉండి, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రీమియం చెల్లించని వారు.. వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. వైద్య చికిత్స ఖర్చు రూ.లక్షల్లో అవుతున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్య బీమా పాలసీతోనే భరోసా ఉంటుంది. పాలసీ కొనసాగుతూ ఉంటే ఇబ్బంది లేదు.. ఒకసారి జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను ఆపేసి, మళ్లీ తీసుకోవాలంటే.. కొన్ని చిక్కులు తప్పవు. పైగా ప్రీమియమూ అధికం అవుతుంది. కరోనా వచ్చిన తర్వాత 90 రోజుల వరకూ కొత్త పాలసీని ఇవ్వడానికీ బీమా సంస్థలు ఇష్టపడటం లేదు. ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు కొవిడ్‌-19 చికిత్సకు వర్తిస్తుందా, ఏదైనా నిబంధనలున్నాయా అని చూసుకోండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details