తెలంగాణ

telangana

Minister Amarnath on BJP: ఒక్క సీటు కూడా లేని బీజేపీకి 20 సీట్లు కావాలంటా..!: మంత్రి అమర్నాథ్

By

Published : Jun 12, 2023, 8:46 PM IST

Minister Amarnath responded to Amit Shah's comments : కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు దోచుకుంటోందన్న అమిత్ షా ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క లోక్​సభ సీటు కూడా లేని బీజేపీకి 20 సీట్లు కావాలంటా అని ఎద్దేవా చేశారు

Etv Bharat
Etv Bharat

Minister Amarnath responded to Amit Shah's comments : రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బీజేపీకి 20 లోక్‌సభ సీట్లు కావాలట అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖపట్నం సభలో చేసిన వ్యాఖ్యలపైమంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పార్టీల పరంగా సంబంధం లేదని, కేవలం ప్రభుత్వాల పరంగా మాత్రమే సహకారం ఉందని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అమిత్‌షా ఒక్కమాటా మాట్లాడలేదని అన్నారు.

రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే జగన్ బొమ్మ వేసుకుంటున్నారన్న అమిత్ షా విమర్శలపై.. రాష్ట్రం పన్నుల నుంచే పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏమిటో దిల్లీ పెద్దలు చెప్పాలని అన్నారు. బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య బంధం కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు. ఏ పార్టీపై ఆధారపడాల్సిన పరిస్థితి వైఎస్సార్సీపీకి లేదని మంత్రి అమర్నాథ్ చెప్పారు. పథకాలన్నీ ఎంతో దయతో ఇస్తున్నట్లు చెప్పిన కేంద్రం.. స్టీల్‌ప్లాంట్, ప్రత్యేక హోదాపై ఏపీకి ఏమీ చేయలేదని అన్నారు. పోలవరం విషయంలోనూ కేంద్రం సాయం చేయడం లేదని అన్నారు.

బీజేపీ కంటే టీడీపీలో సంబురాలు.. ''భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల పాలన సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో మహజన్ సంపర్క్ పేరిట సభలు నిర్వహిస్తోంది. ఇన్నేళ్ల మోదీ పాలనలో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు.విశాఖ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, అంతకుముందు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కువ సంబరాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, నోరు మెదపని తోక పార్టీల్లో అమిత్ షా వ్యాఖ్యలు, విమర్శలను ఏదో రకంగా వినియోగించుకోవాలనే ఆరాటం కనిపిస్తోంది. ప్రజలకు అదిస్తున్న సంక్షేమ పథకాలన్నీ మేమే చేస్తున్నాం.. కేవలం ఫొటోలు పెట్టుకుంటున్నారని అమిత్ షా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఆదాయాన్నే పంపిణీ చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా చెల్లించిన ఆదాయాన్నే తిరిగి పంపిణీ చేస్తోంది. నాలుగేళ్లుగా అవినీతి జరుగుతోందని, వైఎస్సార్సీపీ నాయకులు దోచుకుంటున్నారని చెప్తున్న అమిత్ షా వాటిని నిరూపించగలరా అని ప్రశ్నిస్తున్నాం. విశాఖలో విద్రోహ శక్తులు ఉన్నాయనే వ్యాఖ్యలను విశాఖ వాసిగా తీవ్రంగా ఖండిస్తూ.. అమిత్ షా వస్తున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరిధిలోనే కొనసాగుతుందని ప్రకటన చేస్తారని ఇక్కడి ప్రజలు ఆకాంక్షించారు. కానీ, అవేమీ పట్టించుకోకుండా, దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని పరిగణించకుండా...ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అమ్మేసే దానికి అడుగు వేసిందే కేంద్రం.అసలైన ఈ అంశంపై అమిత్ షా మాట్లాడకుండా వైఎస్సార్సీపీ, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విమర్శించారు.

అంతర్గత సంబంధాలు అవాస్తవం... బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య అంతర్గత సంబంధాలున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఏ పార్టీతోనూ పొత్తు లేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అవసరాన్ని బట్టి సంబంధాలు కొనసాగిస్తున్నాం. వారు ఎలా ఉంటే మేం కూడా అదే విధంగా ఉంటాం. విశాఖలో జరిగిన సభా వేదికపై ఉన్నవాళ్లలో ఎవరైనా పుట్టుకతో, 2014కు ముందు బీజేపీతో ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా..? కేంద్రం నిధులతోనే పథకాలు ఇస్తున్నట్లు... నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం సమంజసం కాదు. నాలుగేళ్లలో దాదాపు 2లక్షల కోట్లకు పైగా ప్రజలకు నేరుగా అందించాం. అందులో ఏదైనా అవినీతి జరిగి ఉంటే.. కేంద్రం విచారణ జరిపించొచ్చు కదా..'' అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details