ETV Bharat / city

3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. ఏ క్షణమైనా విశాఖ నుంచి జగన్​ పాలన: మంత్రి అమర్నాథ్​

author img

By

Published : Sep 9, 2022, 7:11 PM IST

Updated : Sep 9, 2022, 10:39 PM IST

Minister Amarnath on 3 capitals: మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అమర్నాథ్​ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్​ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే.. చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని అమర్నాథ్​ ఆరోపించారు.

Minister Amarnath
అమర్నాథ్​

Minister Amarnath on 3 capitals: మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన స్పష్టమైన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు. గతంలో రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి.. కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని, అయితే కొవిడ్ కారణంగా ఇది కొంత ఆలస్యం అయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్​ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ఆరంభించవచ్చని అమర్నాథ్​ పేర్కొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్​ అడుగులు ముందుకు వేస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అమరావతి నుంచి అరసవెల్లి యాత్రకు ఉసిగొల్పారని విమర్శించారు. ఈ యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలపై చేస్తున్న దండయాత్రగా భావిస్తున్నామని అమర్నాథ్ అన్నారు.

అమరావతిలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు సీఎం జగన్​ గురించి చులకనగా, అవహేళనగా మాట్లాడటం సరికాదని మంత్రి అమర్​నాథ్​ అన్నారు. ఈ సభలో చంద్రబాబుతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు చేసిన వ్యాఖ్యలు వింటే వారు కూడా విశాఖ ప్రాంత వ్యతిరేకులుగా భావించాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని, అభివృద్ధి అనేది అంతటా జరగాలని ఆలోచించి మూడు రాజధానుల ప్రకటన చేస్తే, దానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైకాపా మినహా ఇతర రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకించడం అన్యాయమన్నారు. అమరావతిలోని 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదన్న భావనతోనే ఈ సభను ఏర్పాటు చేసినట్లు అర్థం అవుతోందని దుయ్యబట్టారు. అమరావతి వద్దు అని చెప్పలేదని అమరావతిని కూడా కలుపుకొని 3 రాజధానులు చేసి చూపిస్తామని అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు.

"శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 3 రాజధానుల ఏర్పాటు కోసం అడుగుముందుకు వేస్తుంటే.. దాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ఒకటే రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడమే కాకుండా అక్కడ రాజధాని నిర్మాణానికి రూ.లక్షా 10 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం రాజధానికి ఖర్చు పెట్టే కన్నా ఆ మొత్తంతో అనేక పథకాలను ప్రవేశపెట్టడానికి అవకాశం కలిగింది. రాష్ట్రంలో 15వేల కోట్లతో నాడు-నేడు వంటి బృహత్తర కార్యక్రమం, ఆసుపత్రుల అభివృద్ధి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం విశాఖకు రాజధాని వద్దని చెప్పి, మొదటి సారి విశాఖ వచ్చిన చంద్రబాబును ఇక్కడి ప్రజలు ఎలా వెనక్కి పంపించారో అందరికీ తెలుసు." -గుడివాడ అమర్నాథ్ , రాష్ట్ర మంత్రి

Minister Amarnath on GVL: భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మూడు రాజధానుల గురించి చేసిన వ్యాఖ్యలపై అమర్నాథ్​ స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాతే ఈ విషయం గురించి మాట్లాడాలని ఆయన అన్నారు. ఇలా ఉండగా అసెంబ్లీ సమావేశాల అనంతరం భోగాపురం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నామని మీడియా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: అమరావతి టూ అరసవెల్లి యాత్ర పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజధాని కడతామని ప్రభుత్వం చెబుతుంటే.. వద్దంటూ యాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. రైతులు చేస్తున్న పాదయాత్రను వెనకబడిన ఉత్తరాంధ్రపై దౌర్జన్య యాత్రగా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిపై విమర్శలు చేసేందుకే గతంలో తిరుపతి యాత్ర చేపట్టిన అమరావతి రైతులు... మళ్లీ ఇప్పుడు అరసవెల్లి అంటూ యాత్ర చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని పాదయాత్ర పేరిట ప్రజలను రెచ్చగొచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు.

మంత్రి అమర్నాథ్​

ఇవీ చదవండి:

Last Updated :Sep 9, 2022, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.