తెలంగాణ

telangana

Madurai Train Accident : రైలులో మంటలు.. రామేశ్వరం వెళ్తున్న 10 మంది టూరిస్ట్​లు మృతి.. 20 మందికి గాయాలు

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 8:10 AM IST

Updated : Aug 26, 2023, 3:14 PM IST

Madurai Train Accident Today : తమిళనాడులోని మదురైలో స్టేషన్​లో ఆగిఉన్న రైలులో మంటలు చెలరేగి 10 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. మృతులకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించింది దక్షిణ రైల్వే.

Madurai Train Accident Today
Madurai Train Accident Today

రైలులో మంటలు.. రామేశ్వరం వెళ్తున్న పలువురు టూరిస్ట్​లు మృతి

Madurai Train Accident Today :తమిళనాడులోని మదురై రైల్వే స్టేషన్​ వద్ద ఆగి ఉన్న​ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది పర్యటకులు మృతి చెందారు. దాదాపు 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాదిలో ఆధ్యాత్మిక దర్శనం కోసం ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నుంచి ఆగస్టు 17న ఓ టూరిస్ట్​ రైలు బయలుదేరింది. అందులో 60 మందికి పైగా యాత్రికులు తమిళనాడు నాగర్​కోయిల్​లోని పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని శనివారం తెల్లవారుజామున రైలులో మదురై చేరుకున్నారు. అయితే ఆ రైలు.. మదురై రైల్వే స్టేషన్​కు ఒక కిలో మీటరు దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో తమతో పాటు తెచ్చుకున్న సిలిండర్​ను ఉపయోగించి టీ తయారు చేసుకుందామనుకున్నారు.

అయితే టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్‌ పేలి మంటలు (Madurai Train Fire News) చెలరేగాయి. వెంటనే ఆ మంటలు రెండు కోచ్​లకు వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. అయితే కొందరు అందులోనే చిక్కుకుపోయి మరణించారు.

Madurai Train Fire Accident News :ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే, అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. మదురై కలెక్టర్ సంగీత ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్​- ఆర్​పీఎఫ్​ పోలీసులు, ఎస్​ఎస్​ కాలనీ పోలీస్​ స్టేషన్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు మంత్రి మూర్తి సహా తదితరులు ఘటనా స్థలిని సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మృతుల కుటుంబాలకురూ.10 లక్షలు ఎక్స్​గ్రేషియా..
ఈ విషాద ఘటన పట్ల దక్షిణ రైల్వే స్పందించింది. రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించింది.

రైలు ప్రమాదంలో మృతి చెందిన పర్యటకులు

ఇది హృదయ విదారక ఘటన : యోగి ఆదిత్యనాథ్​
ఈ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ విచారం వ్యక్తం చేశారు. యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్​గ్రేషియా : స్టాలిన్
ఈ రైలు దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్​ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు నాణ్యమైన చికిత్స అందేలా చూడాలని తమిళనాడు మంత్రి మూర్తిని ఆదేశించినట్లు తెలిపారు. మృతదేహాలను వారి సొంతూళ్లకు తరలించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణిస్తుండగానే ఇంజిన్​లో మంటలు

ఆగి ఉన్న రైలులో అగ్ని ప్రమాదం

Last Updated : Aug 26, 2023, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details