తెలంగాణ

telangana

లోక్​సభ ముందుకు 'దిల్లీ బిల్లు'.. చట్టం చేసే హక్కు ఉందన్న షా.. ప్రజాస్వామ్యంపై దాడి అంటూ ఆప్ ధ్వజం

By

Published : Aug 1, 2023, 4:45 PM IST

Updated : Aug 1, 2023, 5:03 PM IST

Delhi Ordinance bill in Parliament : వివాదాస్పద దిల్లీ సర్వీసుల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది. దిల్లీ విషయంలో ఎలాంటి చట్టాన్నైనా తీసుకొచ్చే హక్కు పార్లమెంట్​కు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే, బిల్లును విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన అత్యంత అప్రజాస్వామ్యయుత బిల్లు ఇదేనని ఆప్ మండిపడింది.

delhi-ordinance-bill-in-parliament
delhi-ordinance-bill-in-parliament

Delhi Ordinance bill in Parliament : దిల్లీలో సీనియర్ అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్​ స్థానంలో తీసుకొచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది. 'గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెర్రిటరీ ఆఫ్‌ దిల్లీ' సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సభలో ప్రవేశపెట్టారు. ముందుగానే ఆర్డినెన్స్​ను తీసుకురావడానికి గల కారణాలను ఆయన వివరించారు. అనంతరం మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా తీసుకొచ్చే హక్కు పార్లమెంట్​కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు సైతం ఇదే స్పష్టం చేసిందని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.

Delhi ordinance bill Lok Sabha : అయితే, దిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యం స్థానంలో 'బాబుక్రసీ'ని తీసుకొచ్చేందుకే ఈ బిల్లును తెచ్చారని దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన అత్యంత అప్రజాస్వామ్యయుత బిల్లు ఇదేనని వ్యాఖ్యానించింది. 'ఆర్డినెన్స్​తో పోలిస్తే మరింత దారుణంగా ఈ బిల్లును రూపొందించారు. దిల్లీ ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. భారత సమాఖ్య వ్యవస్థపై ఇది దాడి వంటిది. ఇండియా కూటమి ఎంపీలంతా ఈ బిల్లును వ్యతిరేకిస్తారు' అని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి సైతం బిల్లును వ్యతిరేకించారు. సహకార సమాఖ్య విధానాన్ని ఈ బిల్లు పూర్తిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. 'ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను విస్తృతం చేయడానికే ఈ బిల్లు తెస్తున్నారు' అని పేర్కొన్నారు.
మరోవైపు, లోక్​సభలో జనన, మరణ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు-2023 ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళనల మధ్యే ఈ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. మరో రెండు బిల్లులకు సైతం లోక్​సభ పచ్చజెండా ఊపింది.

ఎన్​డీఏకు బీజేడీ మద్దతు
ఇదిలా ఉండగా.. బిజు జనతా దళ్ దిల్లీ సర్వీసుల బిల్లుకు మద్దతు ప్రకటించింది. విపక్షాల అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయనున్నట్లు తెలిపింది. రాజ్యసభలో మెజారిటీ లేని ఎన్​డీఏకు బీజేడీ నిర్ణయం కలిసిరానుంది.

దిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీలపై నిర్ణయాధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. ఎన్నికైన ప్రభుత్వానికే ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీలపై అధికారం ఉండాలని మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాకుండా కేంద్ర ప్రభుత్వం మే 19వ తేదీ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆర్డినెన్స్​కు వ్యతిరేకిస్తూ దిల్లీ సర్కారు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Rajya Sabha majority 2023 : రాజ్యసభలో సీట్ల సంఖ్య 243 కాగా.. ప్రస్తుతం 238 మంది సభ్యులు ఉన్నారు. ఓటింగ్ రోజు వీరంతా సభకు హాజరైతే.. బిల్లు గట్టెక్కేందుకు 120 ఓట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఎన్​డీఏకు పెద్దల సభలో 100 మంది ఎంపీలు ఉన్నారు. విపక్ష ఇండియా కూటమికి 101 సీట్లు ఉన్నాయి. బీజేడీ 9 మంది రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటేస్తే ఎన్​డీఏ బలం 109కి పెరుగుతుంది. మిగిలిన పెద్ద పార్టీలైన బీఆర్ఎస్​కు ఏడుగురు, వైఎస్ఆర్ కాంగ్రెస్​కు 9 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉండగా.. వైసీపీ అనుకూలంగా వ్యవహరించే సూచనలు ఉన్నాయి. ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్.. ఇండియా కూటమి పక్షాన నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా బలం 109కి చేరనుంది. ఎన్​డీఏ బలం 118కి పెరగనుంది. ఈ పరిస్థితుల్లో నామినేటెడ్ సభ్యులు, ఇతర ఇండిపెండెంట్ల ఓట్లు కీలకం కానున్నాయి. సాధారణంగా వీరంతా ఎన్​డీఏకు మద్దతుగా ఉంటున్నారు.

Last Updated :Aug 1, 2023, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details