తెలంగాణ

telangana

DOST NOTIFICTION 2023-24 : దోస్త్​ నోటిఫికేషన్ వచ్చేసింది.. రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే

By

Published : May 11, 2023, 3:32 PM IST

Updated : May 12, 2023, 6:52 AM IST

DOST NOTIFICTION
DOST NOTIFICTION

15:29 May 11

మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల దోస్త్‌ ప్రక్రియ

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

DOST NOTIFICTION 2023-24 : డిగ్రీ ఆన్​లైన్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి దోస్త్ ప్రకటన జారీ చేసింది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్​తో కలిసి దోస్త్ నోటిఫికేషన్​ను విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ పరిధిలోని.. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, డీఫార్మసీ తదితర సంప్రదాయ డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు.

గతేడాది నిండని సీట్లను తొలగించడంతో.. 86,000 సీట్లు తగ్గాయి. ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోని 136 ప్రభుత్వ కాలేజీలు సహా 1054 కళాశాలల్లో.. 3 లక్షల 86 వేల సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలను మే 16 నుంచి మూడు విడతల్లో ప్రక్రియ చేపట్టేలా దోస్త్ షెడ్యూల్ ప్రకటించారు. మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు రూ.200 చెల్లించి ఆధార్​తో అనుసంధానమైన మొబైల్​ఫోన్ ద్వారా దోస్త్ వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

టీఎస్​యాప్ ఫోలియో, ఫేస్ అథ్ యాప్ ద్వారా లేదా యూనివర్సిటీలు.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లింబాద్రి వివరించారు. ఆన్​లైన్​లోనే ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది దోస్త్ మొబైల్ యాప్‌ కూడా అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన విద్యార్థులు.. మే 20 నుంచి జూన్ 11 వరకు కాలేజీలు, కోర్సులను ఎంచుకొని వెబ్​ ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఎన్​సీసీ, క్రీడలు, దివ్యాంగులు తదితరులకు జూన్ 8, 9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పారు. జూన్ 16న డిగ్రీ మొదటి విడత సీట్లను కేటాయిస్తామని.. సీటు పొందిన అభ్యర్థులు జూన్ 16 నుంచి 25 వరకు ఆన్​లైన్​లో కళాశాలలకు రిపోర్ట్ చేయాలని లింబాద్రి స్పష్టం చేశారు.

రెండో విడత రిజిస్ట్రేషన్లు :మొదటి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు.. రూ.400 ఫీజు చెల్లించి జూన్ 16 నుంచి 26 వరకు రెండో విడతలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని లింబాద్రి తెలిపారు. జూన్ 16 నుంచి 27 వరకు వెబ్​ ఆప్షన్లు స్వీకరించి.. జూన్ 30న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. రెండో విడతలో సీటు పొందిన అభ్యర్థులు జులై 1 నుంచి 5 వరకు ఆన్​లైన్​లో రిపోర్ట్ చేయాలని వివరించారు.

మూడో విడత రిజిస్ట్రేషన్లు :జులై 1 నుంచి 6 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ఉంటాయని లింబాద్రి అన్నారు. జులై 10న మూడో విడత సీట్లను కేటాయిస్తామని చెప్పారు. మరోవైపు ఈక్రమంలోనే మూడు విడతల్లో సీటు వచ్చిన విద్యార్థులందరూ జులై 10 నుంచి 15 వరకు కళాశాలల్లో చేరాలని పేర్కొన్నారు. జులై 11 నుంచి 15 వరకు ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించి.. జులై 17న డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభించనున్నట్లు లింబాద్రి వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 64 మైనార్టీ, హైకోర్టుకు వెళ్లిన కాలేజీలు దోస్త్‌కు సంబంధం లేకుండా నేరుగా ప్రవేశాలు నిర్వహించనున్నాయి. అయితే ఆ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్​మెంట్ ఉండదని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఈ విద్యా సంవత్సరం 11 ప్రభుత్వ కాలేజీల్లో నాలుగేళ్ల బీఎస్సీ ఆనర్స్ కోర్సు ప్రారంభం కానుంది. డీఫార్మసీ కోర్సును కూడా దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇవీ చదవండి:Bandi on Double Bedroom Houses : ''డబుల్‌' ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే.. తప్పుదోవ పట్టించారు'

స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సుప్రీం కీలక నిర్ణయం.. తీర్పు రిజర్వ్

Last Updated :May 12, 2023, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details