Agnipath Protest: త్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా కూడా మారాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం.. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
Bharat Bandh: భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడిన నిరసనకారులపై కఠినంగా వ్యవహరించాలని సీనియర్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు మొబైల్, కెమెరా, సీసీటీవీల ద్వారా హింసకు పాల్పడే వారిపై డిజిటల్ ఆధారాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
వందల రైళ్లు రద్దు.. భారత్ బంద్ కారణంగా దేశంలో.. సికింద్రాబాద్ తరహా ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. 181 మెయిల్ ఎక్స్ప్రెస్లతోపాటు 348 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. నాలుగు మెయిల్ ఎక్స్ప్రెస్లతో పాటు ఆరు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. కాగా, భారత్ బంద్ నేపథ్యంలో మొత్తం 539 రైళ్లు ప్రభావితమయ్యాయి.
పంజాబ్లో పోలీసులు అప్రమత్తం..భారత్ బంద్ పిలుపుతో అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ అధికారులు.. పోలీసులను ఆదేశించారు. దీంతో పాటు పంజాబ్లోని అన్ని ప్రధాన సైనిక కోచింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
హరియాణాలో భద్రత కట్టుదిట్టం.. 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హరియాణాలో కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆదివారం ఫరీదాబాద్లో రెండు వేలకు పైగా పోలీసులను మెహరించారు.
ఝార్ఖండ్లో పాఠశాలలు మూసివేత.. సోమవారం భారత్ బంద్ దృష్ట్యా ఝార్ఖండ్లో అన్ని పాఠశాలలను మూసివేశారు అధికారులు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మూసివేసిన్నట్లు ఝార్ఖండ్ విద్యాశాఖ అధికారి తెలిపారు.
బంగాల్, బిహార్లో మొహరించిన పోలీసులు..భారత్ బంద్ దృష్ట్యా హవుడా రైల్వే స్టేషన్, షాలిమార్ స్టేషన్, హవుడా బ్రిడ్జి వద్ద భారీగా పోలీసులను మొహరించారు. బిహార్లోని పట్నాలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
దిల్లీలో బలగాల మోహరింపు..నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం.. ఈడీ ముందు హాజరుకానున్నారు. మరోవైపు భారత్ బంద్ పిలుపునివ్వటం వల్ల దిల్లీ పోలీసుల.. మాన్సింగ్ రోడ్డులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
దిల్లీలో పోలీసుల అప్రమత్తం
వాట్సాప్ గ్రూపులు బ్యాన్.. 'అగ్నిపథ్' పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం.. 35 వాట్సాప్ గ్రూప్లను ఆదివారం బ్యాన్ చేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక నిరసనలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. నిషేధానికి గురైన వాట్సాప్ గ్రూప్ల పేర్లు, వాటి నిర్వాహకులపై తీసుకున్న చర్యల గురించి మాత్రం అధికారులు వెల్లడించలేదు.
ప్రయోజనాలు వివరించినా.. దేశవ్యాప్తంగా 'అగ్నిపథ్' రిక్రూట్మెంట్ స్కీమ్పై నిరసనలు వెల్లువెత్తుతున్నా.. దాన్ని వెనక్కి తీసుకునేది లేదని త్రివిధ దళాలు ఆదివారం స్పష్టం చేశాయి. పైగా నియామక షెడ్యూళ్లను కూడా విడుదల చేశాయి. 'అగ్నిపథ్' ప్లాన్కు సంబంధించి ఆదివారం త్రివిధ దళాల అధికారులు.. సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో పథకం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. అయినా యువత నిరసనలను ఆపడం లేదు.
ఇవీ చదవండి:'అగ్నిపథ్ ఆగేదే లేదు'.. నియామక షెడ్యూళ్లు ప్రకటించిన త్రివిధ దళాలు
'అగ్నిపథ్పై వెనక్కి తగ్గం.. ఆ నిరసనకారులను చేర్చుకోం!'