తెలంగాణ

telangana

5 States Election Date 2023 : 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఫలితాలు ఎప్పుడంటే?

By PTI

Published : Oct 9, 2023, 12:33 PM IST

Updated : Oct 9, 2023, 1:10 PM IST

5 States Election Date 2023 : ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. ఛత్తీస్​గఢ్​లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఫలితాలు ఒకే రోజు విడుదల కానున్నాయి.

5 States Election Date 2023
5 States Election Date 2023

5 States Election Date 2023 :2024 సార్వత్రిక సమరానికి ముందు కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది భారత ఎన్నికల సంఘం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. రాజస్థాన్​కు నవంబర్ 23న, మధ్యప్రదేశ్​కు నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్​గఢ్​లో రెండు విడతల్లో పోలింగ్ జరపనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్7, 17వ తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మిజోరంలో నవంబర్ 7న.. చివరగా తెలంగాణకు నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లైంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు
  • ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఓటర్లు- 16కోట్లు
  • పురుష ఓటర్లు- 8.2కోట్లు
  • మహిళా ఓటర్లు- 7.8కోట్లు
  • తొలిసారి ఓటు వేసేవారు- 60.2 లక్షలు
  • మొత్తం పోలింగ్ స్టేషన్లు- 1.77 లక్షలు
  • రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్
    • నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 30
    • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: నవంబర్ 6
    • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 7
    • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 9
    • రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 23
    • రాజస్థాన్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
    • మొత్తం ఓటర్లు: 5.25 కోట్లు
  • మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్
    • నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 21
    • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 30
    • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 31
    • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 2
    • మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 17
    • మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
    • మొత్తం ఓటర్లు: 5.6 కోట్లు
  • ఛత్తీస్​గఢ్ ఎన్నికల షెడ్యూల్
    • నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 13 (తొలి విడత), అక్టోబర్ 21 (రెండో విడత)
    • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 20(తొలి), అక్టోబర్ 30(రెండో)
    • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21(తొలి), అక్టోబర్ 31(రెండో)
    • నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 23(తొలి), నవంబర్ 2(రెండో)
    • ఛత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 7 (తొలి విడత), నవంబర్ 17 (రెండో విడత)
    • ఛత్తీస్​గఢ్ ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
    • మొత్తం ఓటర్లు: 2.03 కోట్లు
  • మిజోరం ఎన్నికల షెడ్యూల్
    • నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 13
    • నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 20
    • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21
    • నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 23
    • ఎన్నికల పోలింగ్ తేదీ: నవంబర్ 7
    • ఎన్నికల ఫలితాల తేదీ: డిసెంబర్ 3
    • మొత్తం ఓటర్లు: 8.52లక్షలు

ఏ రాష్ట్రంలో ఎలా?
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వచ్చే ఏడాది జనవరిలో గడువు ముగియనుంది. మిజోరం ప్రభుత్వానికి డిసెంబర్ 17 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని ఓసారి పరిశీలించి చూస్తే..

మధ్యప్రదేశ్​
మధ్యప్రదేశ్​లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా అందులో బీజేపీకి 128 మంది సభ్యులు ఉన్నారు. విపక్ష కాంగ్రెస్​కు 98 మంది బలం ఉంది. బీఎస్​పీకి ఒక ఎమ్మెల్యే ఉండగా.. స్వతంత్రులు ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2018లో జరిగిన ఎన్నికల్లో 114 గెలుచుకున్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 109 స్థానాలు కైవసం చేసుకుంది. మెజారిటీకి 116 మంది సభ్యులు అవసరం కాగా.. బీఎస్​పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. అయితే, 2020 మార్చిలో అప్పటి కాంగ్రెస్ కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది. ఆయనతో సహా 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ కమల్​నాథ్ సర్కారు కూలిపోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పిన నేతలంతా బీజేపీలో చేరారు.

రాజస్థాన్
రాజస్థాన్​లో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉంది. అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు కాగా.. ప్రస్తుతం కాంగ్రెస్​కు 108, మిత్రపక్షమైన ఆర్ఎల్​డీకి ఒక సీటు ఉంది. 12 మంది స్వతంత్రులు సైతం అధికారపక్షానికి మద్దతుగా ఉన్నారు. ప్రధాన విపక్షం బీజేపీకి 70 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ 2024 జనవరి 14 వరకు కొనసాగనుంది. రాజస్థాన్​లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 73 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్​పీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులతో పాటు స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఛత్తీస్​గఢ్
ఛత్తీస్​గఢ్​లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. ఇక్కడి అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా.. కాంగ్రెస్​కు ప్రస్తుతం 71 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 15 సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది.

మిజోరం
మిజోరంలో 40 అసెంబ్లీ సీట్లు ఉండగా.. మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ 27 సీట్ల బలంతో అధికారంలో కొనసాగుతోంది. జొరామ్స్ పీపుల్స్ మూమెంట్​(6), కాంగ్రెస్(5), బీజేపీ(1), టీఎంసీ(1)లు విపక్షంలో ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలుచుకుంది. జొరామ్స్ పార్టీకి 8 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికలకు ముందు 34 స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్.. ఫలితాల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కేవలం 5 స్థానాలకే పరిమితమైంది.

CWC Meeting Today : 'ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పక్కా వ్యూహం అవసరం.. క్రమశిక్షణతో పనిచేయాలి'

Ladakh Election Results 2023 : లద్దాఖ్ ఎన్నికల్లో కాంగ్రెస్​ కూటమి ఘన విజయం.. బీజేపీ డీలా

Last Updated : Oct 9, 2023, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details