300 Crores Seized In Odisha :ఒడిశాలోని సంబల్పుర్ జిల్లాలో రూ.300 కోట్లకుపైగా నగదును పట్టుకున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఇందులో భాగంగానే రెండు మద్యం కంపెనీలకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ క్రమంలో బీరువాలో భద్రపరిచిన కోట్ల విలువైన డబ్బు కట్టలను స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వీటిని బుధవారం నుంచి లెక్కించడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.50కోట్ల నగదును లెక్కించినట్లు అధికారులు చెప్పారు. నగదు లెక్కించే యంత్రాలను నిరాటంకంగా నడిపించేసరికి అవి పనిచేయడం లేదని వివరించారు.
ఝార్ఖండ్లోనూ..
మరోవైపు, ఝార్ఖండ్లోని పలు మద్యం కంపెనీల్లోనూ దాడులు నిర్వహించింది ఐటీ శాఖ. బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. పశ్చిమ ఒడిశాలో అతిపెద్ద స్వదేశీ మద్యం తయారీ, విక్రయ కంపెనీలలో ఒకటిగా ఉన్న బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన బలంగీర్ కార్యాలయంలో రూ.150 కోట్లకుపైగా అక్రమ నగదు దొరికింది. అలాగే సంబల్పుర్ కార్పొరేట్ కార్యాలయంలో కూడా రూ.150 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ సంస్థ బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్కు వ్యాపార భాగస్వామిగా ఉంది. కాగా, ప్రస్తుతం ఒడిశాలోని బలంగీర్, సంబల్పుక్ జిల్లాల్లో, ఝార్ఖండ్లోని రాంచీ, లోహర్దగా ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం సుందర్గఢ్ మద్యం వ్యాపారి రాజ్కిషోర్ ప్రసాద్ జైస్వాల్కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగాయి.