Rajya Sabha Elections 2024 in Telangana : తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు (Telangana Rajya Sabha Poll)కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 8న మొదలై గురువారంతో ముగియనుంది. ఈనెల 16న పరిశీలన, 20న ఉపసంహరణకు గడువు విధించింది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో ఉన్న పార్టీల బలాబలాల ప్రకారం చూస్తే రెండు కాంగ్రెస్కు, ఒకటి బీఆర్ఎస్కు దక్కనున్నాయి. మొదట మూడింటికి పోటీ చేయాలని భావించిన హస్తం పార్టీ తర్వాత రెండింటితోనే సరిపెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Telangana Congress Rajya Sabha Candidates :నామినేషన్లు వేసేందుకు ఒక్క రోజే గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠానం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. ఏఐసీసీ కోటా కింద పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారం హైదరాబాద్ రానున్నారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు నిధుల సమీకరణకు అజయ్ మాకెన్ వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటా కింద అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్ బరిలో ఆ అభ్యర్థి!
Telangana Rajya Sabha Elections 2024 :మరోవైపు రెండో సీటు కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా ఒకటి ఓసీ సామాజికవర్గం, మరొకటి బీసీ లేదా ఎస్టీకి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంతోపాటు ఏఐసీసీ యోచిస్తోంది. అజయ్ మాకెన్ ఓసీ కావడంతో రాజ్యసభ ఆశిస్తున్న జానారెడ్డి, చిన్నారెడ్డి, రేణుకా చౌదరిలకు అవకాశం లేనట్లేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీసీ, ఎస్టీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, వి. హనుమంత రావుతోపాటు జి.నిరంజన్ సహా పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.