తెలంగాణ

telangana

కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల జాబితా సిద్ధం - ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 7:14 AM IST

Rajya Sabha Elections 2024 in Telangana : రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులను ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండడంతో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం కోటా అభ్యర్థి ఓసీ అయితే రాష్ట్రం నుంచి బీసీ లేదా ఎస్టీ సామాజికవర్గం అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తున్నారు.

Telangana Rajya Sabha Elections 2024
Telangana Rajya Sabha Elections 2024

రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులపై ఇవాళ స్పష్టత

Rajya Sabha Elections 2024 in Telangana : తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు (Telangana Rajya Sabha Poll)కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 8న మొదలై గురువారంతో ముగియనుంది. ఈనెల 16న పరిశీలన, 20న ఉపసంహరణకు గడువు విధించింది. ఈ నెల 27న ఎన్నిక‌లు జరగనున్నాయి. శాసనసభలో ఉన్న పార్టీల బలాబలాల ప్రకారం చూస్తే రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు దక్కనున్నాయి. మొదట మూడింటికి పోటీ చేయాలని భావించిన హస్తం పార్టీ తర్వాత రెండింటితోనే సరిపెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Telangana Congress Rajya Sabha Candidates :నామినేషన్లు వేసేందుకు ఒక్క రోజే గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠానం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. ఏఐసీసీ కోటా కింద పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారం హైదరాబాద్‌ రానున్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్రకు నిధుల సమీకరణకు అజయ్ మాకెన్ వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటా కింద అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్​ బరిలో ఆ అభ్యర్థి!

Telangana Rajya Sabha Elections 2024 :మరోవైపు రెండో సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా ఒకటి ఓసీ సామాజికవర్గం, మరొకటి బీసీ లేదా ఎస్టీకి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంతోపాటు ఏఐసీసీ యోచిస్తోంది. అజయ్‌ మాకెన్‌ ఓసీ కావడంతో రాజ్యసభ ఆశిస్తున్న జానారెడ్డి, చిన్నారెడ్డి, రేణుకా చౌదరిలకు అవకాశం లేనట్లేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీసీ, ఎస్టీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, వి. హనుమంత రావుతోపాటు జి.నిరంజన్‌ సహా పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.

తరలివచ్చిన ఆశావహులు - 300 దాటిన దరఖాస్తులు

అయితే పార్టీ కోసం వీహెచ్ అహర్నిశలు కష్టపడుతున్నట్లు భావిస్తున్న పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, అజారుద్దీన్‌లు కూడా పోటీపడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరిని రాజ్యసభ వరిస్తుందో ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), సీనియర్‌ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబులతో మాట్లాడిన తరువాత ఏఐసీసీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.

Telangana Congress Rajya Sabha Candidates : గురువారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో రేపే నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు స్థానాలకు ముగ్గురు నామినేషన్‌ వేసినట్లయితే ఏకగ్రీవమవుతాయి. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో అదే రోజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై సభ్యుల వివరాలు తీసుకున్న పీఈసీ కమిటీ

ఖమ్మం లోక్​సభ స్థానంపై కాంగ్రెస్​లో పోటాపోటీ - టికెట్ ఆశిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబీకులు

ABOUT THE AUTHOR

...view details