తెలంగాణ

telangana

బల్దియాలో భారీ కుంభకోణం - బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై అక్రమంగా వాణిజ్య ప్రకటనలు

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 7:30 AM IST

Updated : Feb 28, 2024, 9:01 AM IST

GHMC Bus Shelter Scam In Hyderabad : గ్రేటర్ హైదరాబాద్​లో వాణిజ్య ప్రకటనల విభాగంలో భారీ కుంభకోణం బయటపడింది. బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్ల పై అక్రమంగా వాణిజ్య ప్రకటనలు వేస్తూ కొంత మంది అధికారులు దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీవల పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నగర బీజేపీ కార్పోరేటర్లు మండిపడగా మేయర్ హౌస్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. హౌస్ కమిటీ విచారణలో తమ బండారం ఎక్కడ బయపడుతుందోనని ముందే మేల్కొన్న అధికారులు రాత్రికి రాత్రే అక్రమంగా వేసిన బస్ షెల్టర్లు, వాటిపై ఏర్పాటు చేసిన ప్రకటనలను తొలగించడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది.

Etv Bharat
Etv Bharat

బల్దియాలో భారీ కుంభకోణం - బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై అక్రమంగా వాణిజ్య ప్రకటనలు

GHMC Bus Shelter Scam In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని (Ghmc) ప్రకటనల విభాగంలో భారీ అవినీతి బయటపడింది. ఆ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు యాడ్‌ ఏజెన్సీలతో కుమ్మకై అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. బస్‌షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై ప్రకటనలకుఅక్రమంగా అనుమతి ఇస్తూ గత ఐదేళ్లుగా సుమారు వెయ్యికోట్ల రూపాయలు దండుకున్నట్లు సమాచారం. ఇటీవల పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నగర బీజేపీ కార్పొరేటర్లు మండిపడగా మేయర్ హౌస్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 1500లకు పైగా బస్‌ షెల్టర్లను నిర్మించారు. వాటిలో ఎక్కువ బస్ షెల్టర్లు బస్సులు తిరగని మార్గాల్లోనే కనిపిస్తుంటాయి. ప్రయాణికుల అవసరం కంటే వాటి ద్వారా వచ్చే ఆదాయంపైనే అధికారులు దృష్టిపెట్టారు. బస్ షెల్టర్ల నిర్వహణ, ప్రకటనలకు టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించారు. ఐతే టెండర్‌లో ఎన్ని ప్రైవేట్‌ సంస్థలు పోటీపడినా రెండు సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారులపై కార్పొరేటర్ల ఆగ్రహం - జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో రసాభాస

" దాదాపు 1000 కోట్ల జీహెచ్ఎంసీ నిధులను పక్కదారి పట్టించిన కంపెనీల మీద చర్యలు తీసుకోలేదు. మేయర్ వెంటనే దీనిపై సమావేశం ఏర్పాటు చేయాలి. వాణిజ్య ప్రకటనల పేరుతో దందా చేసి కోట్లాది రూపాయల దోచుకున్న వారు తమ ఏజెన్సీలను కాపాడేందుకే ఇప్పుడు బస్ షెల్టర్​ను తీసేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి అవినీతి తిమింగలాలను బయటపెట్టాలి. దీనిపై ఏసీబీ విచారణ చేపట్టాలి." - మధుసూదన్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్

Illegal Commercial Advertisements On Bus Shelters: ఒక్కో బస్‌ షెల్టర్‌పై ప్రకటనలకు 40వేల నుంచి 50 వేల వరకు ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. ఐతే టెండర్ ద్వారా దక్కించుకున్న బస్‌షెల్టర్ల కంటే అదనంగా బస్‌ షెల్టర్లపై అక్రమ అనుమతులతో ప్రకటలు వేసుకునేందుకు అనుమతిచ్చినట్లు కార్పొరేటర్లుగుర్తించారు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జీహెచ్ఎంసీకి చెల్లించకుండా ఏజెన్సీలు, అధికారులు పంచుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. ప్రకటనల విభాగంలోని అవినీతి అధికారులను బదిలీ చేయడం అర్థరాత్రి అక్రమ బస్‌ షెల్టర్లు తొలగించడంపై బీజేపీ కార్పొరేటర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాణిజ్య ప్రకటనల పేరుతో దందా చేసి కోట్లాది రూపాయల దోచుకున్న వారు, ఏజెన్సీలను కాపాడేందుకే అధికారులు అలా చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. వెంటనే ఆ వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రకటనల విభాగంలో అవినీతిపై గ్రేటర్ కార్పొరేటర్లంతా పార్టీలకు అతీతంగా గళం వినిపిస్తున్నారు. బల్దియా ఖజానాకు గండి కొట్టి కోట్లాది రూపాయలు ఎత్తుకెళ్తుంటే అధికారులు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. కార్తీక్ ట్యాక్స్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి అవినీతి తిమింగలాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రేటర్​లో మరో 25 మంది కార్పొరేటర్లపై కాంగ్రెస్​ ఫోకస్​ - టార్గెట్​ రీచ్​ అయితే 4 ఎంపీ సీట్లు పక్కా!

గ్రేటర్​పై కాంగ్రెస్ గురి - అధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా చేరికలకు ఆహ్వానం

Last Updated : Feb 28, 2024, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details