తెలంగాణ

telangana

మధ్యతరగతికి నిర్మల గుడ్​న్యూస్! ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం- ఐదేళ్లలో రెండు కోట్ల ఆవాసాలు

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 12:14 PM IST

Updated : Feb 1, 2024, 12:34 PM IST

Union Budget 2024 Housing : మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. మధ్యతరగతి నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మరోవైపు, వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్‌ యోజన కింద 2కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు.

union budget 2024 housing
union budget 2024 housing

Union Budget 2024 Housing : మధ్యతరగతి ప్రజల కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మధ్యతరగతి నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. మురికివాడలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇళ్లు కట్టుకోవడానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తుందని వెల్లడించారు. అందుకు జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.

3కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలోనే!
మధ్య తరగతి వారి సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ కరోనా కాలంలో కూడా కొనసాగిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లు కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.

కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌
విద్యుత్‌ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్‌లో నూతన పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌ టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ.15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఈ పథకం గురించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.

భారీ ఎత్తున రుణసాయం
"పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం. మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్‌ ధన్‌ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు ఆదా అయ్యింది. స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద 1.4 కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించాం. పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్లు విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేశాం" అని నిర్మల ప్రకటించారు.

ఊరట ఇవ్వని కేంద్ర బడ్జెట్! పన్ను విధానంలో మార్పుల్లేవ్!

'అసమానతలు లేని భారత్​ మా లక్ష్యం- 2047 నాటికి పేదరికం కనబడదు!'

Last Updated : Feb 1, 2024, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details