ETV Bharat / business

ఊరట ఇవ్వని కేంద్ర బడ్జెట్! పన్ను విధానంలో మార్పుల్లేవ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 12:12 PM IST

Updated : Feb 1, 2024, 2:28 PM IST

Union Budget 2024
Union Budget 2024

Union Budget 2024 Income Tax : మధ్యంతర బడ్జెట్​లో పన్ను చెల్లింపుదారులకు నిరాశ ఎదురైంది. కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న పన్ను విధానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు.

Union Budget 2024 Income Tax : కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న పన్ను స్లాబులను కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులతో పాటు ఇంపోర్ట్ డ్యూటీల విధానంలోనూ ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు.

కాగా, తమ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించిందని పేర్కొన్నారు నిర్మల. ఫేస్​లెస్​ విధానంతో పన్ను అసెస్మెంట్​లో పారదర్శకత, సత్వర రిటర్న్​లు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. అంతేగాక, జీఎస్టీ పన్ను పరిధి పెరిగిందని పేర్కొన్నారు. సరాసరి నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ.1.66 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త సంస్కరణలతో జల, వాయు రవాణా మార్గాల్లో నూతన కంటెయినిరిటీ పోల్‌ ఏర్పాటు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

"భారతదేశంలో ఈ పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు మూడు రెట్లు పెరిగారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నాం. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షలలోపు ఆదాయం వరకు పన్ను రహితం చేశాం."
--నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి

ఈ పదేళ్లలో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారుల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగిందన్న నిర్మల, పన్నుల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు పట్టే సమాయాన్ని 93 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించడమే కాకుండా రిఫండ్‌లను వేగవంతం చేసినట్లు వివరించారు. అంకుర సంస్థలు, పెన్షన్‌ ఫండ్ల కోసం పన్ను ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్య లోటును 4.5 శాతానికి తగ్గించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల వెల్లడించారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్‌ నోటీసులు అందుకొన్న వారికి ఆర్థిక మంత్రి ఊరటనిచ్చారు. 2009-10 మధ్య 25 వేల వరకు డిమాండ్‌ నోటీసులను ఉపసంహరించుకొనున్నట్లు చెప్పారు. 2010-11 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.10 వేల వరకు చెల్లించాలని జారీ అయిన నోటీసులను రద్దు చేస్తామని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు కోటి మంది లబ్ధిపొందనున్నట్లు ఆమె తెలిపారు. వ్యాపారాలను సరళతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు

Last Updated :Feb 1, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.