YS Sharmila Padayatra Update : 'అతి త్వరలోనే ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం'
YS Sharmila Praja Prasthanam Padayatra : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఈ నెలలోనే ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభిస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. నాలుగు వేల కిలోమీటర్ల ప్రస్థానం పాలేరు గడ్డ మీదనే పూర్తి చేస్తానని వెల్లడించారు. వైఎస్ 74వ జయంతి సందర్భంగా ఖమ్మం గ్రామీణం కరుణగిరిలో వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు నాయకులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచాయని షర్మిల వ్యాఖ్యానించారు. పేదలు అనారోగ్యం బారిన పడితే అప్పుల పాలవుతారని భావించే.. వైఎస్ ఆరోగ్య శ్రీ పథకాన్ని తెచ్చారని ఆమె గుర్తు చేశారు. గిరిజనులకు పోడు భూములు, పేదలకు 46 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్దేనని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే పాలేరులోని ప్రతి గడపకు వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. పాలేరు గడ్డ.. వైఎస్ బిడ్డకు అడ్డా అని ఆమె స్పష్టం చేశారు.