Rajagopalreddy Emotional Speech : 'బండి సంజయ్ని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి... పూటకో పార్టీ మారే వ్యక్తిని కాదు'
Rajagopalreddy Emotional Speech on Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి కారణం సంజయ్ అని చెప్పారు. నాయకుల్లో, శ్రేణుల్లో జోష్ నింపింది బండి సంజయ్ మాత్రమేనని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తనని గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నైతికంగా గెలిచిందని ఆయన తెలిపారు. దేశంలో ప్రధాని మోదీకి సరిపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. కొంత కాలంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకేటనని ప్రచారం జరుగుతుందని.. అలాంటివి ఆరోపణలు మాత్రమే అందులో నిజం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పూటకో పార్టీ మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పని చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ని అధికారం నుంచి దించే సత్తా బీజేపీకి మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు.