Medchal Rains : అలుగు పారుతున్న పెద్దచెరువు.. చేపల వేటలో ప్రజలు
Fishing in Medchal Pedda Cheruvu : రాష్ట్రంలో వాన జోరు తగ్గినా.. దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతుండగా.. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మేడ్చల్ జిల్లాలో పలు చోట్ల చెరువులు నిండుకుండలా మారి అలుగు పోస్తున్నాయి. ఉరకలెత్తుతున్న వాగుల ఉద్ధృతికి రహదారులపై నీళ్లుచేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
మేడ్చల్ పెద్దచెరువు అలుగు పారుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు చేపలు పట్టుకునేందుకు ఎగబడ్డారు. వలలతో చేపలు పడుతూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టిన ప్రతి వ్యక్తి ఆనందంతో వాటితో ఫొటోలు దిగుతున్నారు. పెద్దచెరువు అలుగు చూడడానికి ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. మరోవైపు దుండిగల్ పరిధి మల్లంపేట, కొత్తకుంట ప్రాంతంలో వరదలో చిక్కుకున్న 50 కుటుంబాలకు చెందిన 200 మందిని అధికారులు బోటు సాయంతో బయటకు తీసుకొచ్చారు. వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్నారనే సమాచారంతో సహాయకచర్యలు చేపట్టారు. వారిని పునరావాస కేంద్రానికి తరలించి భోజనాలు అందించారు.