Maneru Vagu in Peddapalli : ఉప్పొంగిన మానేరు వాగు.. ఇసుక క్వారీలో చిక్కుకున్న 12 మంది
People trapped in maneru at Gopalpur : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో గోదావరి, మానేరు, తీగలవాగు, ఆరె వాగులు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రజాజీవనం అతలాకుతలమైంది. మానేరు వాగు ఉప్పొంగడంతో మంథని మండలం గోపాల్పూర్ ఇసుక క్వారీలో 12 మంది చిక్కుకున్నారు. వారిలో ఒకరు గల్లంతైనట్లు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి జిల్లా పాలనాధికారి ముజమ్మిల్ ఖాన్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, రెవెన్యూ, పోలీస్ అధికారులు చేరుకుని వారిని సురక్షితంగా తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టారు. మల్హర్ మండలంలోని ఆరెవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కొయ్యూరు తాడిచెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాడిచెర్ల రెవెన్యూ ఆఫీస్ చుట్టూ వరద నీరు చేరింది. మల్లారం సబ్స్టేషన్ చుట్టూ వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మండలంలోని కుంభంపల్లి గ్రామం చుట్టూ వరద నీరు చేరడంతో జలదిగ్బంధం అయ్యింది. మంథని కాటారం ప్రధాన రహదారిపై.. అడవి సోమనుపల్లి వద్ద మానేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు.