MLA Mynampally Fires on Harish Rao : 'హరీశ్రావు గల్లీ లీడర్ లెక్క మాట్లాడుతున్నారు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు'
Published : Oct 8, 2023, 1:47 PM IST
MLA Mynampally Fires on Harish Rao in Medak : కరోనా సమయంలో మైనంపల్లి రోహిత్ ఎక్కడికి వెళ్లాడని ఓ మంత్రి అంటున్నారని.. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao) అన్నారు. ఆ మంత్రి గల్లీ లీడర్ లెక్క మాట్లాడుతున్నారని.. హరీశ్రావును ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శించారు. సేవా కార్యక్రమాలు చేసే సత్తా ఉంటే తమతో పోటీ పడాలని అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ జిల్లాకు ఏం చేశారని బీఆర్ఎస్ను గెలిపించాలని మైనంపల్లి హనుమంతరావు నిలదీశారు. అధికార పార్టీ అగ్ర నేతలు రూ.కోట్లలో దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. మెదక్ను పట్టించుకుంటే.. గజ్వేల్, సిరిసిల్ల కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందేదని అన్నారు. ఈ క్రమంలోనే మైనంపల్లి వచ్చిన తర్వాతే మెదక్కు వైద్య కళాశాల, రామాయంపేటకు రెవెన్యూ డివిజన్, డిగ్రీ కాలేజీ వచ్చాయని తెలిపారు. వీటిని ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు.