Minister Prashanth Reddy VS MLA Bajireddy Govardhan : 'మంత్రిగారు.. మాకూ నిధులు కేటాయించండి..' అధికారపార్టీ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ
Published : Oct 6, 2023, 9:38 PM IST
Minister Prashanth Reddy VS MLA Bajireddy Govardhan : నిధుల విషయంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సాక్షిగా సీనియర్ ఎమ్మెల్యే, మరో మంత్రి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి జూనియర్ కళాశాల మైదానం ఇందుకు వేదికైంది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ధర్పల్లిలో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు.
BRS Meeting at Dharpally Nizamabad district : సభలో మొదట మాట్లాడిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్.. జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి తక్కువ నిధులు కేటాయించారని... బాల్కొండ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చాయని అన్నారు. చిన్న వయస్సులోనే పెద్ద పదవిలో ప్రశాంత్ రెడ్డి ఉన్నారని.. మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. మళ్లీ మంత్రి అయి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఆ తర్వాత మాట్లాడిన జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి బాజిరెడ్డి వ్యాఖ్యల పట్ల స్పందించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని.. ఎన్ని నిధులు ఇచ్చినా ఎమ్మెల్యే బాజిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.200 కోట్లతో రూరల్ నియోజకవర్గంలో రోడ్లు వేయించామని తెలిపారు.