Driver Burnt Alive in Lorry Accident Peddapalli : లారీని ఢీకొట్టిన మరో లారీ.. డ్రైవర్ సజీవదహనం.. కొద్దిలో తప్పించుకున్న క్లీనర్
Published : Aug 26, 2023, 8:28 AM IST
|Updated : Aug 26, 2023, 11:58 AM IST
Driver Burnt Alive in Lorry Accident Peddapalli : ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల వారి ప్రాణాలను పోగొట్టుకుని.. వారినే నమ్ముకున్న కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. తాజాగా రెండు లారీలు ఢీకొనగా అందులోని డ్రైవర్ సజీవ దహనమైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగడంతో ఓ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఏలూరు నుంచి పెద్దపల్లి వైపు టైల్స్లోడ్తో వెళుతున్న లారీ.. కాట్నపల్లిలో ఓ మిల్లు నుంచి నూక లోడ్తో వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి లారీ చిక్కుకుపోయింది. అందులో చిక్కుకున్న డ్రైవర్ సజీవ దహనం కాగా.. క్లీనర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.