BJP door to door campaign in Maheshwaram : 'వచ్చే ఎన్నికల్లో.. బీజేపీకే ప్రజల బ్రహ్మరథం'
BJP door to door campaign in Maheshwaram : రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. మోదీ తొమ్మిదేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా.. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా గత ఐదు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ధోరణిని ఎండగడుతూ తన పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేరు మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజల వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, వ్యాపారులకు, రైతులకు, మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల జాబితాను కరపత్రాల రూపంలో ఇంటింటికి అందజేశారు. రానున్న రోజుల్లో మహేశ్వరంతో పాటు.. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.