భారీ వర్షాలు.. వరదల బీభత్సం.. 5లక్షల మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు!

By

Published : Jun 24, 2023, 12:20 PM IST

thumbnail

Assam Floods 2023 : భారీ వర్షాలతో అసోం అతలాకుతలమవుతోంది. పలు జిల్లాల్లో వరదలు సంభవించి గ్రామాలు నీట మునిగాయి. దీంతో చాలా మంది ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో, రోడ్ల మీదే కాలం వెళ్లదీస్తున్నారు. ఊర్లకు ఊర్లే చెరువులుగా మారిపోవడం వల్ల దాదాపు 5 లక్షల మందికిపైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు చెప్పారు.  

మరోవైపు వరదల కారణంగా అసోం వ్యాప్తంగా దాదాపు 14 వేల హెక్టార్లలో పంటలు మునిగిపోయినట్లు అంచనా. 3 లక్షల 50 వేలకు పైగా పెంపుడు జంతువులు కూడా వరదల వల్ల ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. వరద ధాటికి పలు చోట్ల వంతెనలు కూలిపోయాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో నల్బరీ జిల్లాలో వరద నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు. అంతకుముందు వరదల వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల వల్ల మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది.

బజలి జిల్లాలో దాదాపు 2.67 లక్షల మంది, నల్బరిలో 80,061 మంది, బార్‌పేటలో 73,233 మంది, లఖింపుర్‌లో 22,577 మంది, దర్రాంగ్‌లో 14,583 మంది, 7,280 మంది తాముల్‌పుర్‌లో 7,280 మంది వరదల వల్ల ప్రభావితమయ్యారు. 54 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1,538 గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. బ్రహ్మపుత్ర, మానస్ నదులు ఉద్ధృతిగా ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.