ETV Bharat / sukhibhava

త'స్మార్ట్' జాగ్రత్త.. 2022 నేర్పిన ఆరోగ్య పాఠాలెన్నో..

author img

By

Published : Dec 31, 2022, 10:30 AM IST

health care tips from expert doctors
ఆరోగ్య సూత్రాలు

కరోనాతో ఉక్కిరిబిక్కిరై ప్రపంచం విలవిలలాడింది. ఆరోగ్యం కోసం ప్రజలందరూ పరుగులు తీశారు.. దీని విలువేంటో కొవిడ్ సమయంలో తెలిసింది. మరిన్ని విషయాలు నిపుణుల నుంచి తెలుసుకుందాం..

జీవితాన్ని మించిన గురువు లేరు.. అనుభవాన్ని మించిన పాఠం లేదు.. మరి గడిచిపోతున్న 2022 మనకు నేర్పిన పాఠాలేంటి? భవితకు వేసిన బాటలేంటని చూస్తే నేర్చుకోవాల్సిన గుణపాఠాలెన్నో ఉన్నాయి. కరోనాతో ఉక్కిరిబిక్కిరై ప్రపంచం విలవిలలాడింది. ఆరోగ్యం కోసం ప్రజలందరూ పరుగులు తీశారు.. దీని విలువేంటో కొవిడ్ సమయంలో తెలిసింది. మరిన్ని విషయాలు నిపుణుల నుంచి తెలుసుకుందాం..

డా. దినేశ్‌ కుమార్‌ చిర్ల
శిశు వైద్య నిపుణులు, రెయిన్‌బో హాస్పిటల్‌

పిల్లలను పట్టించుకోండి
పిల్లల్లో ఎదుగుదలతో ముడిపడిన ఆటిజం, ఏకాగ్రత లోపంతో కూడిన అతి చురుకుదనం (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. వీటికి మూలం ఇతరులతో గడిపే సమయం తగ్గిపోవటం.

  • చిన్న కుటుంబాల్లో ఇంట్లో తల్లిదండ్రులు తప్ప పెద్దవాళ్లు ఉండరు. ఉద్యోగ, వ్యాపార ఒత్తిళ్ల మధ్య వారు పిల్లలతో ఎక్కువ సమయం గడపటానికీ కుదరటం లేదు.
  • పిల్లలను సముదాయించటానికి ఎంతోమంది స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి డిజిటల్‌ పరికరాలను తేలికైన మార్గమని భావిస్తున్నారు. ఏడుస్తున్నప్పుడో, అన్నం తినిపిస్తున్నప్పుడో వారి చేతికి ఫోన్లు ఇచ్చేయటం ఎక్కువైంది. క్రమంగా ఇదొక అలవాటుగా మారిపోతోంది. పిల్లలు ఎంతసేపూ వీటితోనే గడపటం వల్ల ఇతరులతో కలిసి ఆడుకోవడం, కళ్లలోకి కళ్లు పెట్టి చూసి మాట్లాడటం తగ్గిపోతోంది. ఇవన్నీ ఎదుగుదల సమస్యలకు దారితీస్తున్నాయి. వీటిని వీలైనంత త్వరగా గుర్తించడం అవసరం. ఆలస్యమైనకొద్దీ పరిస్థితి చేయి దాటిపోతుంది.
  • మాటలు రావడం ఆలస్యమవుతున్నా, కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నా, పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోతున్నా, ఇతర పిల్లలతో కలవలేకపోతున్నా, ప్రవర్తనలో తేడా కనిపించినా తాత్సారం చేయరాదు.
  • మూడేళ్లు వచ్చేవరకు పిల్లలను డిజిటల్‌ స్క్రీన్లకు దూరంగా ఉంచాలి.
  • ఆటలు, శారీరక శ్రమ తగ్గడం వల్ల పిల్లల్లో ఊబకాయం, అధిక బరువూ ఎక్కువవుతున్నాయి. కాలుష్యం మూలంగా దగ్గు, అలర్జీ వంటి సమస్యలూ పెరుగుతున్నాయి.
  • వీలైనంత ఎక్కువ సమయం వారితో గడపడానికి ప్రయత్నించాలి. పార్కుల వంటి చోట్లకు తీసుకెళ్లాలి.
  • ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి. దీనివల్ల మానసిక వికాసం కలుగుతుంది.
  • దగ్గు, జలుబు లక్షణాలు కనిపించగానే చాలామంది యాంటీబయాటిక్‌ మందులు కొని పిల్లలకు వేస్తుంటారు. ఇది తగదు. తరచూ దగ్గుతున్నా, విడవకుండా దగ్గు వేధిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. అలర్జీ కారణమేమో చూసుకోవాలి.
  • ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించి, ప్రొటీన్‌ మోతాదు పెంచాలి. కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు లేని జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి.
గుండే
  • మాస్కు ధరించటం ద్వారా కొవిడ్‌, క్షయతో పాటు చాలారకాల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను నివారించుకోవచ్చు.
  • న్యుమోనియా టీకా జీవితంలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. దీన్ని వేయించుకోనివారు విధిగా తీసుకోవాలి.
  • ఏటా ఫ్లూ టీకా తీసుకోవాలి.
- డా. ఎన్‌.కృష్ణారెడ్డి, కార్డియాలజిస్ట్‌, కేర్‌ కార్డియాక్‌ సెంటర్‌, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ హాస్పిటల్‌

చిన్న వయసైనా.. గుండె భద్రం
చిన్న వయసులోనే గుండెపోటు బారినపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం, ఊబకాయం, పొగ తాగడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఇంత చిన్న వయసులో గుండెపోటు ఏంటని అనుకోవటం, హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం, డాక్టర్‌ను సంప్రదించక పోవడమూ ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరోవైపు ఇన్‌ఫెక్షన్లు సైతం ముప్పును పెంచుతున్నాయి. కొవిడ్‌ అనే కాదు.. ఎలాంటి ఇన్‌ఫెక్షన్లయినా గుండెపోటును తెచ్చిపెట్టొచ్చు. ఇన్‌ఫెక్షన్లతో రోగనిరోధక వ్యవస్థ స్పందించి, వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తం గడ్డకట్టే ముప్పు పెరుగుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కొన్నిసార్లు గుండెపోటుతో హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

క్యాన్సర్‌

రొమ్ముక్యాన్సర్‌ కేసులు ఏటా పెరుగుతూనే వస్తున్నాయి. ఈ ధోరణి 2022లోనూ కొనసాగుతూ వచ్చింది. గత సంవత్సరం కన్నా ఈసారి 2.45% కేసులు పెరిగాయి.

- డా. సింహాద్రి చంద్రశేఖర్‌, సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, సౌమ్య-రెనోవా హాస్పిటల్‌

ఇంటి పని ఇతరుల కోసం.. వ్యాయామం మీ కోసం!

  • జీవనశైలి మార్పులు, తొలి సంతానం ఆలస్యంగా కలగటం, ఊబకాయం వంటివి దీనికి దోహదం చేస్తున్నాయి.
    వయసు మీద పడుతున్నకొద్దీ క్యాన్సర్‌ వచ్చే అవకాశమూ ఎక్కువవుతూ వస్తోంది.
  • బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక బరువు, ఊబకాయం ఉంటే తగ్గించుకోవాలి.
    సమతులాహారం తినాలి. కొవ్వులు, తీపి పదార్థాలు తగ్గించుకోవాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇంటి పనిని వ్యాయామంగా పరిగణించరాదు. ‘ఇంటి పని ఇతరుల కోసం, వ్యాయామం మీ కోసం’ అని తెలుసుకోవాలి.
  • స్నానం చేస్తున్నప్పుడు సబ్బు చేతులతో రొమ్ములను తాకి, గడ్డలేవైనా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి.
  • నెలసరి నిలిచిన తర్వాత చనుమొనల నుంచి రక్తస్రావమైతే నిర్లక్ష్యం చేయరాదు.
డాక్టర్‌ కిరణ్‌ దింట్యాల, ఇంటర్నల్‌ మెడిసిన్‌ వైద్యులు, శాన్‌ డియాగో, అమెరికా

శరీరానికే కాదు మనసుకూ స్నానం
రోజూ పొద్దున్నే పళ్లు తోముకుంటాం, స్నానం చేస్తాం, టిఫిన్‌, భోజనం చేస్తాం. ఇలా శరీర సంరక్షణ కోసం రోజుకు కనీసం గంటన్నర, రెండు గంటలైనా కేటాయిస్తాం. మరి మనసు కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం? శరీరం మాదిరిగానే మనసును శుభ్రం చేసుకోవడమూ ముఖ్యమే. మన మదిలో ప్రతికూల భావనలు చేరుతూనే వస్తుంటాయి. ఇవి పోగుపడుతున్నకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే జీవితంలో స్పష్టత వస్తుంది. పరిస్థితులకు మనం ప్రతిస్పందించే తీరే ఒత్తిడిని నిర్ణయిస్తుంది. చుట్టుపక్కల పరిస్థితులు, పరిసరాలు ఎప్పుడూ అనుకూలంగా ఉండాలనేమీ లేదు. ఇవి మన మీద కొంత ప్రభావం చూపొచ్చు కానీ వాటిని ఎంతవరకు పట్టించుకుంటున్నాం? ఎలా ఆలోచిస్తున్నాం? వాటికి ఎలా ప్రతిస్పందిస్తున్నాం? అనేవే ప్రధానం. వీటిని అర్థం చేసుకుంటే ఒత్తిడిని నియంత్రించుకోవటం కష్టమేమీ కాదు. జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా, హాయిగా జీవించటం నేర్చుకోవాలి. సీరియస్‌గా తీసుకోవటం తగ్గించుకోవాలి.

  • ఒత్తిడిని మన ఆలోచనలతోనే సృష్టించుకుంటున్నాం. బాధలను ఎక్కువ చేసుకుంటున్నాం. ఏదైనా జరగకూడనిది జరిగితే దానికి లేనిపోనివి ఆపాదించి, పదే పదే దాని గురించే తలచుకుంటుంటాం. దీంతో విచారం, బాధ ఎక్కువవుతాయే గానీ తగ్గవు. జరిగిందేదో జరిగిపోయింది. వాటిని వెనక్కి మళ్లించలేం. బాధపడటం వల్ల ప్రయోజనం లేదని గుర్తించి.. బయటపడేందుకు ప్రయత్నించాలి.
  • ఆధునిక తరం చిటికెలో పనులు అయిపోవాలని భావిస్తోంది. ఫోన్‌లో ఒక్క క్లిక్‌తోనే అన్ని పనులు చేసేసుకుంటోంది. అన్నీ ఇలాగే జరగాలని లేదు కదా. కాబట్టి ఓపికగా ఎదురు చూడడం, సమయం కోసం నిరీక్షించడం అత్యవసరం. జీవితం వంద మీటర్ల పరుగు పందెం కాదు. ఇదొక మారథాన్‌. ఎన్నో ఒడుదొడుకులు ఎదురవుతుంటాయి. వీటన్నింటినీ తట్టుకునే సామర్థ్యమూ (ఎండ్యూరెన్స్‌) అవసరమే. ప్రయత్నాన్ని ఆపేస్తే బలహీనపడతాం. ఒత్తిడి నియంత్రణకు శిక్షణ అవసరం. ఇలాంటివి పాఠశాల స్థాయిలో చేపడితే మేలు.
డా. కె.వి.దక్షిణామూర్తి, నెఫ్రాలజిస్ట్‌, మహాత్మా శ్రీరామచంద్ర సెంటినరీ మెమోరియల్‌ హాస్పిటల్‌

కిడ్నీలు జాగ్రత్త
నిజానికి 2022లో కొవిడ్‌ ప్రభావం తక్కువే కానీ అంతకుముందు దీని బారినపడ్డవారిలో దుష్ప్రభావాలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఇవి కిడ్నీ మీద విపరీత ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఈ సంవత్సరం దీర్ఘకాల కిడ్నీ జబ్బుల కేసులూ ఎక్కువయ్యాయి. కాబట్టి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • అధిక రక్తపోటు, మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి.
    ఉప్పు, ప్రొటీన్‌ తగ్గించుకోవాలి. పొటాషియం లభించే పదార్థాలను పరిమితం చేసుకోవాలి.
- డా. పి.వి.రావు, మధుమేహ పరిశోధకులు, కుముదినీదేవి డయాబిటీస్‌ రీసెర్చ్‌ సెంటర్‌, రామ్‌దేవ్‌రావ్‌ హాస్పిటల్‌

వాయు కాలుష్యానికి దూరంగా..
కొవిడ్‌ అనంతరం మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య పెరిగింది. దీనికిప్పుడు వాయు కాలుష్యమూ మరింత ఆజ్యం పోస్తోంది. సాధారణంగా గాలి కాలుష్యం ఊపిరితిత్తుల మీదే ఎక్కువ ప్రభావం చూపుతుందని అనుకునేవారు. ఇది మధుమేహం, గుండెజబ్బులకూ కారణమవుతోంది. వాయు కాలుష్యం మూలంగా ఎంతోమంది మధుమేహం బారినపడి పడుతున్నారు. సూక్ష్మ ధూళి కణాలతో కూడిన నుసి (పీఎం 2.5) ఊపిరితిత్తులకే పరిమితం కాదు. ఇది గుండెలోకి.. అక్కడ్నుంచి రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుంటుంది. ప్రతి అవయవంలోని కండరాల్లో అనవసరంగా రోగనిరోధక శక్తిని ప్రేరేపించి, దాన్ని మన మీదే దాడి చేసేలా పురిగొల్పుతుంది. కణాలను దెబ్బతీస్తుంది. మధుమేహ నివారణకు జీవనశైలి మార్పులను పాటించటమే కాదు.. వాయు కాలుష్యానికి గురికాకుండానూ చూసుకోవటం ముఖ్యం. కొవిడ్‌ రాకుండానే కాదు.. మధుమేహ నివారణకు, మధుమేహ మరణాలు తగ్గటానికీ మాస్కు తోడ్పడుతుంది.

ఇవీ చదవండి:

ఆరోగ్యంగా బరువు తగ్గించే ఏబీసీ జ్యూస్​ గురించి మీకు తెలుసా..!

జుట్టు రాలిపోతుందా?.. కారణాలు ఇవే కావొచ్చు!.. వీటిని తింటే సెట్​!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.