ETV Bharat / state

Warangal Flood Victims Problems : అంతా బురదమయం.. బతుకంతా ఆగమాగం.. ఇదీ వరంగల్​వాసుల దీనగాథ

author img

By

Published : Jul 29, 2023, 3:46 PM IST

Flood Victims Problems in Warangal : వరుణుడి ఉగ్ర రూపంతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీశారు. బంధువులు, తెలిసిన వారి ఇళ్లు, పునరావాస కేంద్రాలు.. ఇలా దొరికిన చోట తలదాచుకుని బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీశారు. ఓరుగల్లులో వర్షం సృష్టించిన బీభత్సం నుంచి తేరుకుని.. ఇప్పుడిప్పుడు ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు.. జరిగిన నష్టం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

warangal
warangal

Warangal Flood Victims Problems : అంతా బురదమయం.. బతుకంతా ఆగమాగం.. ఇదీ వరంగల్​వాసుల దీనగాథ

Warangal Floods Latest News : వరద మహోగ్రరూపం నుంచి ఓరుగల్లు మహానగరం ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. వరుణుడు తెరిపినివ్వడంతో ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు జరిగిన నష్టం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ఇళ్ల నుంచి వెళ్లిన వారు.. తిరిగి వచ్చి బురదతో నిండిపోయిన ఆవాసాలను చూసి ఆవేదన చెందుతున్నారు. బొంది వాగు వరద నీరు కారణంగా.. సంతోషిమాత నగర్, గణేశ్ నగర్, ఎన్టీఆర్ నగర్, బీఆర్​ నగర్, రాజీవ్ నగర్, బృందావన్ కాలనీలు జల దిగ్భందంలోనే ఉన్నాయి. హనుమకొండలో పలు కాలనీలు వరద నుంచి బయటపడగా.. ఇళ్లలోకి చేరిన బురదతో నగరవాసులు ఇక్కట్లు పడుతున్నారు. నాలాల నుంచి కొట్టుకొచ్చిన చెత్తా చెదారంతో వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇళ్లను బాగు చేసే పనిలో నగరవాసులు నిమగ్నమయ్యారు. ఏటికేడూ వరదలు ముంచెత్తుతున్నా.. అధికారులు తూతూ మంత్రం చర్యలతో సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Warangal Floods Problems : వరద ముంపు కారణంగా వరంగల్​లోని పలు కాలనీల్లో పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. బీఆర్‌నగర్​లో రెండు ఇళ్లు నేల కూలగా.. సంతోషిమాత నగర్​లో మరో మూడిళ్లు వరద ధాటికి ధ్వంసమయ్యాయి. ఖిలా వరంగల్ లో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. వరదలు సృష్టించిన బీభత్సంతో సర్వం కోల్పోయామని.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

మా ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోయాయి. బియ్యం, బట్టలు, టీవీలు, కూలర్లు, ఫ్రిజ్​లు.. అన్నింటినీ బురద కప్పేసింది. ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదు. చుట్టుపక్కల ఉన్న ఎత్తైన భవనాలపైనే రోజులు వెళ్లదీస్తున్నాం. ప్రభుత్వం మాకు పరిహారం అందించి ఆదుకోవాలి. మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. - వరద బాధితులు

మరో విలయం..: వరద విలయానికి ఇప్పటికే అతలాకుతలమవుతున్న వేళ.. వరంగల్‌ నగరంలోని భద్రకాళీ తాగు నీటి చెరువుకు గండిపడటం ఆందోళనకు గురి చేస్తోంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులోకి భారీ వరద నీరు చేరింది. చెరువు సామర్థ్యానికి మించి నీరు పోటెత్తటంతో పోతననగర్‌ వైపుగా ఉన్న కట్ట బలహీనపడి.. గండిపడింది. దీంతో పోతననగర్‌, రంగంపేట ప్రాంతాలతో పాటు భద్రకాళీ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే వరదల్లో వణుకుతున్న వేళ.. జలాశయానికి గండిపడటంతో పరిసర ప్రాంత కాలనీలవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గండిపడిన విషయాన్ని తెలుసుకుని అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అక్కడికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులు, అధికారులు జలాశయం పరిసరాల్లోని ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చెరువు సామర్థ్యాన్ని తెలుసుకున్న అధికారులు.. ముందుగానే స్పందించటంతో ముప్పు తప్పిందని భావిస్తున్నారు. జేసీబీల సాయంతో గండిపడిన చోట మరమ్మతులు చేపట్టారు. మహానగర పాలక సంస్థ కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్ నేతృత్వంలో ముందస్తుగా కాలనీలవాసులను అప్రమత్తం చేశారు.

ఇవీ చూడండి..:

Warangal Floods 2023 : వాన తగ్గినా వీడని వరద కష్టాలు.. జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు

Warangal Floods News : ఓరు'ఘొల్లు'.. ఆ హృదయ విదారక దృశ్యాలు అన్నీ ఇన్నీ కావు.. చూస్తే గుండె బరువెక్కాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.