పుట్టిన రోజే చావు రోజవుతుందని ఊహించలేకపోయింది ఆ యువతి. మాయమాటలతో మభ్యపెట్టిన దుర్మార్గున్ని నమ్మి కలిసేందుకు వెళ్లి... కన్నవారికి తీరని విషాదాన్ని మిగిల్చింది. పొద్దున్నే గుడికి వెళతానని ఇంట్లో చెప్పి వెళ్లిన తమ కూతురు... వరంగల్ హంటర్ రోడ్డు వద్ద విగతజీవిగా కన్పించటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
సరదాగా గడుపుదామని పిలిచి...
ఓ వైపు చదువు, మరోవైపు తండ్రితో కలసి కూరగాయాల వ్యాపారం నిర్వహిస్తున్న 19 ఏళ్ల మానసకు... జనగామ జిల్లా ఘన్పూర్కు చెందిన సాయిగౌడ్ అలియాస్ సాయికుమార్తో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. బుధవారం అమ్మాయి పుట్టిన రోజు సందర్భంగా కలుద్దామని సాయిగౌడ్ పిలిచాడు. కాజీపేట దగ్గరకు వెళ్లిన యువతిని... కారులో ఎక్కించుకుని చిన్నపెండ్యాల రైల్వేట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి... హత్య చేశాడు.
శవానికే కొత్తబట్టలు...
ఇద్దరు మిత్రుల సాయం కోరగా నిరాకరించటం వల్ల యువతి శవంతో కారులోనే.. హస్నాబాద్, ఎల్కతుర్తి, తదితర ప్రాంతాలకు నిందితుడు తిరిగాడు. మృతురాలి దుస్తులకు రక్తపు మరకలు అంటడం వల్ల ఆందోళనకు గురైన నిందితుడు... సహజ మరణంగా చిత్రీకరించేందుకు కొత్త బట్టలు కొని శవానికి తొడిగాడు. అనంతరం హన్మకొండలోని విష్టుప్రియ గార్డెన్స్ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు.
రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి... ఒక్క రోజులోనే కేసు ఛేదించారు. నిందితుడుని అరెస్ట్ చేసి... కారును స్వాధీనం చేసుకున్నారు.
మిన్నంటిన రోదనలు...
గురువారం ఉదయం శవ పరీక్షల అనంతరం యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా... రోదనలతో ఆ ప్రాంగణం మారుమోగింది. పుట్టిన రోజునే వెళ్లిపోయావా... అంటూ అంతా కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచి వేసింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి... నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది