ETV Bharat / state

అనుమానాలన్నీ పటాపంచలు.. బాటసింగారంలో జోరందుకున్న మామిడి క్రయవిక్రయాలు

author img

By

Published : Apr 30, 2022, 6:30 PM IST

Updated : Apr 30, 2022, 7:59 PM IST

fruit
fruit

Batasingaram Fruit Market: అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ... బాటసింగారంలో మామిడి క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్ట ఏర్పాటు చేశారు. ఊహించిన దానికంటే ఎక్కువే పండ్ల మార్కెట్‌కు తాకిడి మొదలైంది.

బాటసింగారంలో జోరందుకున్న మామిడి క్రయవిక్రయాలు


Batasingaram Fruit Market: రంగారెడ్డి జిల్లా గ‌డ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం బాట‌సింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కోహెడ‌లో గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప‌టిష్ట ఏర్పాట్ల‌తో మార్కెట్‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. నగరానికి శివారు ప్రాంతం కావ‌డం వల్ల వ్యాపారులు, కొనుగోలుదారులు వ‌స్తారా? మార్కెట్‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుందా? అనే అనుమానాల మ‌ధ్య ఇక్క‌డ మార్కెట్‌ను ప్రారంభించారు. అయితే విశాల‌మైన ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేయ‌డం, నేష‌న‌ల్ హైవేకు ప‌క్క‌నే ఉండ‌టం, రాక‌పోక‌ల‌కు అనువైన ప్రాంతం కావ‌డం వల్ల అధికారులు ఆశించిన‌, ఊహించిన‌ దానికంటే ఎక్కువే బాట‌సింగారం పండ్ల మార్కెట్‌కు తాకిడి మొద‌లైంది.

విశాల‌మైన ప్రాంగ‌ణంలో మార్కెట్‌: మామిడి, బ‌త్తాయి, ద్రాక్ష‌, ఇత‌ర పండ్ల క్ర‌య విక్ర‌యాల కోసం హెచ్ఎండీఏ లాజిస్టిక్ పార్క్ నుంచి కొంత స్థ‌లాన్ని, కేవ‌లం మామిడి సీజ‌న్ కోసం సుమారు 17 ఎక‌రాల భూమిని లీజుకు తీసుకొని మార్కెట్ కొన‌సాగిస్తున్నారు. ఎక‌రాకు రూ.75వేల చొప్పున కిరాయి చెల్లిస్తున్నారు. ప్ర‌స్తుతం మామిడి సీజ‌న్ ప్రారంభ స‌మ‌యం కావ‌డం వల్ల రోజుకు 11 నుంచి 14 ట‌న్నుల వ‌ర‌కు కాయ‌లు వ‌స్తున్నాయి. కొల్లాపూర్‌, క‌ల్వ‌కుర్తి, వ‌న‌ప‌ర్తి, కృష్ణా, అనంత‌పురం జిల్లాల నుంచి ఎక్కువ మామిడి వ‌స్తోంది. సుమారు 16 ర‌కాల మామిడి పండ్ల‌తో మార్కెట్ కిట‌కిట‌లాడుతోంది. అందులో బంగిన‌ప‌ల్లి, బేనీషా ఎక్కువ‌గా వ‌స్తోంది. మామిడి పూత స‌మ‌యంలో వ‌ర్షాలు ప‌డి పూత విచ్చుకోక‌పోవ‌డంతో ఈఏడాది కేవ‌లం 30శాతం దిగుబ‌డే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

మార్కెట్‌ బాగుంది. రేట్లు మామూలుగానే ఉన్నాయి. ట్రాఫిక్ ఏం లేదు. వసతులు బాగున్నాయి. అక్కడితో పోలిస్తే ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి.

-బిసన్న, రైతు

వ‌చ్చే ఏడాది నుంచి కోహెడ‌లో మార్కెట్‌: తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని కొహెడ‌లో 178 ఎక‌రాల విశాల‌మైన ప్రాంతంలో సుమారు రూ.450కోట్ల వ్య‌యంతో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో పండ్ల మార్కెట్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మించ‌బోతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఇది నిల‌వ‌బోతోంద‌ని అధికారులు, పాల‌కులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల రోడ్డు క‌నెక్టివిటీ కోసం సంఘీ ద‌గ్గ‌ర ప‌నులు ప్రారంభించారు. మార్కెట్ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌) మ్యాప్ సిద్ధం చేసేందుకు దరఖాస్తు చేసిన 6కంపెనీల టెండర్లు పరిశీలిస్తున్నారు. ప్ర‌భుత్వం ఆమోదించ‌గానే కోహెడ‌లో ప‌నులు మొద‌లుకానున్నాయి. తొలి విడ‌త‌లో రూ.300కోట్ల‌తో, రెండో విడ‌త‌లో రూ.150కోట్ల‌తో ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. వ‌చ్చే ఏడాది మామిడి సీజ‌న్‌ను కోహెడ‌లోనే ఉండేట్లు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు.

పాత మార్కెట్ ఉన్నప్పుడు బాగా ఇబ్బందిగా ఉండేది. ప్రతిదానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. మామిడి రేటు కూడా బాగానే పలికింది. ట్రాఫిక్ జాం లేదు, నీళ్లు, ఇలా అన్ని వసతులు బాగున్నాయి.

-- వెంకటయ్య, రైతు

న‌గ‌రంలోని అన్ని మార్కెట్లు కొహెడ‌కే: హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య విపరీతం కావ‌డం వల్ల అన్ని మార్కెట్ల‌ను ఒకేచోటుకు త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. మ‌లక్‌పేట‌, గుడిమ‌ల్కాపూర్‌, మొజాంజాహి మార్కెట్‌ల‌ను సైతం కోహెడ‌కే తరలించి పూలు, పండ్లు, మిర్చి తదితర అన్ని మార్కెట్లు ఒకే స్థలంలో ఉండేటట్లు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఔట‌ర్ రింగురోడ్డుకు ఆనుకుని కోహెడ మార్కెట్ ఉండ‌టంతో రైతుల‌కు, వినియోగ‌దారుల‌కు, వ్యాపారుల‌కు అనువుగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఇక్కడ అంతా బాగుంది. ట్రాఫిక్ జాం లేదు. అక్కడ ఉన్నప్పుడు బాగా ట్రాఫిక్ జాం అయ్యేది. మాకు ప్రత్యేకంగా కోహెడ దగ్గర మార్కెట్ కడితే బాగుంటుంది. ఇక్కడ రైతులకు పడుకోవడానికి వసతి లేదు. టాయిలెట్స్ లేవు. భోజనాలు చేయాలంటే బయటకు వెళ్లాల్సి వస్తోంది.

-- జగపతి, రైతు

ఏర్పాట్లు బాగున్నాయి: బాట‌సింగారం మార్కెట్‌లో అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని.. రేటు కూడా బాగానే వస్తుందని రైతులు తెలిపారు. మార్కెట్‌లో టాయిలెట్స్‌, తాగునీరు, విశ్రాంతి తీసుకునేందుకు గ‌దులు ఉన్నాయనీ... కొద్దిగా దూర‌భారం అన్పించినా ఇక్క‌డున్న ఏర్పాట్ల‌తో ఆ ప్ర‌యాణ బ‌డ‌లిక తెలియ‌లేదంటున్నారు. వచ్చే సీజన్ వరకు అన్ని హంగులతో శాశ్వత మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

సువిశాల ప్రాంతంలో షెడ్లు వేసుకున్నాం. ప్రతిరోజు 13 నుంచి15 వేల టన్నుల మామిడి వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు మామిడి తీసుకొస్తున్నారు. 12 ఎకరాల్లో మార్కెట్, 4 ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశాం.

-- నరసింహారెడ్డి, మార్కెట్ కార్యదర్శి

ఇవీ చదవండి:

Last Updated :Apr 30, 2022, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.