ETV Bharat / state

Nizamabad Sports grounds : గతమెంతో ఘనం.. వర్తమానమే మరీ దుర్లభం.. ఇది ఇందూరు క్రీడాకారుల పరిస్థితి

author img

By

Published : Jul 14, 2023, 10:24 PM IST

Etv Bharat
Etv Bharat

Nizamabad sports persons problems : ప్రతిభకు కొదువ లేదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉంది. క్రీడ ఏదైనా సరే, ప్రత్యర్థి ఎవరైనా సరే పడగొట్టాల్సిందే, పతకం సాధించాల్సిందే. అయితే గెలిచినపుడు అభినందనలు వెల్లువెత్తుతాయి. ఆహా ఓహా అంటూ కీర్తనలు ఆకాశాన్ని అంటుతాయి. కాని తమ ప్రతిభను సానబెట్టి మరింత మెరికల్లా తయారయ్యేందుకు అవసరమైన సౌకర్యాలు, శిక్షణ సదుపాయాలూ ఉండవు, వెన్నుతట్టి ప్రోత్సహించే వారూ ఉండరు. ఇదీ ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులను దేశానికి అందించిన నిజామాబాద్‌ జిల్లా పరిస్థితి. వీరి స్ఫూర్తితో ఇందూరు బాలబాలికలు అనేక మంది వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుకుంటూ ఉండగా సౌకర్యాలు, శిక్షకుల లేమి వారిని ముందడుగు వేయనీయడం లేదు.

ఇందూరు క్రీడాకారులకు సౌకర్యాల కొరత

Nizamabad DSA ground problems : ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే అది మరింత వికసిస్తుంది. దాగి ఉన్న సత్తాను గుర్తించి సానబెడితే మరింత మెరుగుపడుతుంది. మట్టిలో నుంచి మాణిక్యాలు బయటపడతాయి. అయితే దీనికి కావాల్సింది వెన్నుతట్టి నడిపించే ఉత్సాహమే. అలా నిజామాబాద్‌ జిల్లా నుంచి దేశానికి దక్కిన క్రీడా ఆణిముత్యాలు అంతర్జాతీయ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, మరో బాక్సర్‌ హుసాముద్దీన్, ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి గుగులోత్‌ సౌమ్య . ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి జిల్లా పేరును వీరంతా మారుమోగించారు.

ఇందూరు క్రీడా చరిత్రలో తొలి అర్జున పురస్కారం నిఖత్ జరీన్‌కు దక్కింది. ఇలాంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని అనేక మంది బాలబాలికలు క్రీడారంగం వైపు వస్తున్నారు. గ్రామ, జిల్లా స్థాయిలో సత్తా చాటుకుంటున్నారు. అయితే వీరికి సదుపాయాల లేమి పెద్ద సమస్యగా మారింది. శిక్షకుల కొరత కూడా వీరిని వేధిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. అయితే పతకాలు సాధించగానే వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నా స్థానికంగా క్రీడా మైదానాల్లో సరైన వసతులు లేవు. శిక్షకుల నియామకం ఆగిపోయింది.

Nizamabad Sport Persons : రాష్ట్ర స్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నా జిల్లా స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నగరంలో డీఎస్​ఏ మైదానం, నాగారంలోని రాజారాం స్టేడియాలు ఉన్నా అవి కేవలం ఆట స్థలాలు మాత్రమే. అక్కడ ఎలాంటి వసతులు లేవు. క్రీడాకారులు శిక్షణ పొందేందుకు అనుకూలమైన ఒక్క మైదానమూ జిల్లాలో అందుబాటులో లేదు. దీంతో అరకొర సాధనతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. డీఎస్​ఏ మైదానంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్.. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను దేశానికి అందించింది. మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఈ మైదానంలోనే ఐదేళ్లు సాధన చేసింది.

"ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. వారిలా మేము కూడా మంచి పతకాలు గెలవాలని వచ్చాం. కానీ ఇక్కడ అలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం స్పందించి వెంటనే క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం."- సాయి దివ్య కబడ్డీ క్రీడాకారిణి

Nizamabad DSA ground problems : కామన్వెల్త్ లో పతకాలు సాధించిన హుసాముద్దీన్ సైతం బాక్సింగ్‌లో ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నాడు. ఇలాంటి ప్రతిభావంతులు ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో క్రీడాసౌకర్యాలు కల్పించడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించడం లేదు. బాక్సింగ్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు హుసాముద్దీన్ అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతున్నాడు. తండ్రి సంసముద్దీన్ శిక్షణతో బాక్సింగ్​లో రాణిస్తున్న హుసాముద్దీన్.. కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు కాంస్యం అందుకున్నాడు. జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. ఆసియా ఎలైట్ బాక్సింగ్​లోనూ కాంస్యం దక్కించుకున్నాడు.

ఆర్మీలో సుబేదార్ హోదాలో పని చేస్తున్నాడు. జిల్లాకు చెందిన ఇతర క్రీడాకారులు సైతం వీరి బాటలో నడవాలంటే ప్రభుత్వం చొరవ చూపి బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జాతీయ క్రీడ హాకీలో నిజామాబాద్‌ జిల్లాకు ఒలింపిక్స్​లో ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లభించింది. జిల్లాకు చెందిన క్రీడాకారిణి యెండల సౌందర్య హాకీలో అదరొగట్టి ఇందూరు పేరును ప్రపంచంలో నెలబెట్టింది. ఈమె ప్రస్తుతం భారత సీనియర్ మహిళా జట్టు శిక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు. సౌందర్య సాధన చేసింది సైతం నగరంలోని డీఎస్​ఏ మైదానంలోనే.

"ఇదే గ్రౌండ్​లో చాలా మంది ప్రాక్టీస్ చేసి మంచి పతాకాలు సాధించారు. ఇందూరులో క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి సరైన మౌలిక వసతులు లేవు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి మంచి వసతులు కల్పిస్తే.. తెలంగాణకు మంచి పతకాలు వచ్చే విధంగా యువకులు శిక్షణ తీసుకుంటారు".- డా. స్వామికిరణ్, పీఈటీ

అయితే ఆమె సాధన కాలం నాటికి ఇప్పటికీ ఈ మైదానంలో సౌకర్యాల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇక్కడ హాకీ సాధన చేస్తుంటే దుమ్ము, ధూళి ఎగిసిపడి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడికి పంపించేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ మైదానంలో సరైన హాకీ శిక్షకుడిని ఏర్పాటు చేయాలని, టర్ఫ్ పిచ్‌తో ఇండోర్ స్టేడియం నిర్మించాలని, హాకీ స్టిక్స్ అందుబాటులో ఉంచాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫుట్‌బాల్‌లో అంతర్జాతీయంగా రాణిస్తున్న నిజామాబాద్‌ జిల్లాకు చెందిన క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య.. శిక్షకుడు నాగరాజు వద్ద మెళకువలు నేర్చుకుంది.

మొదటి నుంచి ఈ ఆట సాధనకు జిల్లాలో మైదానం లేదు. ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో వారి అంగీకారంతో ఆమె శిక్షణ సాగింది. ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారాల్సి వచ్చింది. సౌమ్య స్వీడన్ లో జరిగిన ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇండియా తరపున ఆడింది. అలాగే విదేశాల్లో జరిగే వివిధ క్లబ్‌ల తరపున పోటీల్లో పాల్గొని సత్తా చాటుతోంది. ఆమె బాటలో మరే ఇతర క్రీడాకారులకు జిల్లా నుంచి సత్తా చాటే అవకాశం లభించడం లేది. కారణం సరైన సాధన చేసే అవకాశం లేకపోవడమే. ఈ నేపథ్యంలో జిల్లాలో ఫుట్‌బాల్ సాధనకు స్థలం కేటాయించి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

"ఇక్కడ నేర్చుకున్న చాలా మంది అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. మరి ఇప్పుడు నిజామాబాద్​లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఎందరో ఎమ్మెల్యేలు, ఎంపీలు మారిన మైదనాలు అభివృద్ధి జరగడం లేదు. స్థానికులుగా అనేక సార్లు ఫిర్యాదులు చేశాం. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు." - కైసర్, స్థానికుడు

వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ నిజామాబాద్‌ జిల్లాలో పలువురు క్రీడాకారులు రాణిస్తున్నారు. బోధన్ కు చెందిన రఫీయోద్దీన్ ఉషూ క్రీడలో సత్తా చాటుతున్నారు. జార్జియాలో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. అలాగే తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ధర్మారం సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని సంహిత, సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని లిఖిత పాల్గొన్నారు. వీరంతా సౌకర్యాల లేమి మధ్యే సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. నిజామాబాద్‌లో క్రీడాకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సరైన మైదానం లేకపోవడం.

Telangana Sports Academy : నగరంలోని పాత కలెక్టరేట్‌కు అనుబంధంగా ఉన్న చిన్న మైదానమే క్రీడాకారులకు దిక్కుగా మారింది. ఈ మైదానంలోనే ఓ పక్క బాక్సింగ్, మరో పక్క హాకీ, ఇంకోవైపు ఫుట్ బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ వంటి క్రీడల్లో సాధన చేయాల్సి వస్తోంది. నిజామాబాద్‌ నగరంలోనే ఉన్న డీఎస్​ఏ పరిధిలోని స్విమ్మింగ్ ఫూల్ ను సైతం తరలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే మైదానంలో స్కేటింగ్, కుస్తీ సాధన సాగుతోంది. దీన్ని కూడా తరలిస్తామనే వార్తలు వస్తూ ఉండంతో క్రీడాకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కామారెడ్డి జిల్లాలోనూ క్రీడాకారులకు వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.