ETV Bharat / state

CM KCR Mancherial Tour : 'తెలంగాణ దేశంలో చాలా రంగాల్లో నంబర్‌వన్‌ స్థాయికి చేరింది'

author img

By

Published : Jun 9, 2023, 7:03 PM IST

Updated : Jun 9, 2023, 8:40 PM IST

CM KCR
CM KCR

CM KCR Comments at Mancherial Meeting : తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశంలో చాలా రంగాల్లో నంబర్‌ వన్‌ స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంచిర్యాలలో బీఆర్​ఎస్ కార్యాలయంతో పాటు నూతన కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మంచిర్యాల వేదికగానే బీసీ కులవృత్తులకు రూ.లక్ష సాయం, రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

CM KCR Mancherial Tour Today : మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నస్పూర్‌లో 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని, జిల్లా బీఆర్​ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం రహదారి వంతెన, హాజీపూర్ మండలం గుడిపేటలో వైద్య కళాశాల, మందమర్రిలో రూ.500 కోట్ల వ్యయంతో ఫామ్ ఆయిల్ పరిశ్రమ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అధికారులను ఉద్దేశిస్తూ కేసీఆర్ కాసేపు మాట్లాడారు. అనేక విషయాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్న కేసీఆర్.. సంక్షేమ పథకాల్లో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు.

తెలంగాణ దేశంలో చాలా రంగాల్లో నంబర్‌వన్‌ స్థాయికి చేరింది: సీఎం కేసీఆర్

'పరిపాలన సంస్కరణ అంటే పది ఆఫీసులు ఏర్పాటు చేసి.. నలుగురు ఆఫీసర్లను పెంచడం కాదు. సంస్కరణ అనేది ఒక రోజుతో అంతం అయ్యేది కూడా కాదు. ఇది నిరంతర ప్రక్రియ. సంస్కరణలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అనేక విషయాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంది. కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైంది. దేశంలో నోట్ల రద్దు భయంకరమైన పరిస్థితి. సంక్షేమ పథకాల్లో అగ్రస్థానంలో ఉన్నాం. సంక్షేమ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్నాం. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. యాదవులకు గొర్రెల పంపిణీ విజయవంతంగా చేపట్టాం. 3.8 లక్షల మందికి రెండో విడత గొర్రెల పంపిణీ.'-సీఎం కేసీఆర్

భారత్‌కు తెలంగాణ తలమానికంగా నిలవాలి..: రాష్ట్రంలో మాతా-శిశు మరణాలు చాలా తగ్గాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కంటి వెలుగు పరీక్షలు స్ఫూర్తిగా నిలిచాయన్న ఆయన.. దిల్లీ, పంజాబ్‌లో కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. భారత్‌కు తెలంగాణ తలమానికంగా నిలవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కొత్త రాష్ట్రం ఏర్పడే నాటికి ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రాబోతున్నాయని, పెద్ద సంఖ్యలో వాటిని ఏర్పాటు చేస్తామని అన్నారు. పామాయిల్‌కు దేశంలో గిరాకీ ఏర్పడుతోందన్న కేసీఆర్.. ఆ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలన్నారు.

అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... జిల్లాలో నిర్వహించే ప్రగతి నివేదన బహిరంగ సభకు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రం వేదికగా బీసీ, చేతి కులవృత్తుల కుటుంబాలకు.. రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అలాగే రెండో విడత గొర్రెల పంపిణీని కూడా కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​లో మంచిర్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్​కు.. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక బీఆర్​ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు.

ఇవీ చదవండి :

Last Updated :Jun 9, 2023, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.