ETV Bharat / state

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అటువైపే చూడని అధికారులు

author img

By

Published : May 25, 2022, 9:41 AM IST

ఇసుక అక్రమ రవాణా
ఇసుక అక్రమ రవాణా

అనుమతుల్లేకుండా ఒకరు.. అనుమతుల పేరుతో మరికొందరు.. పట్టపగలే దోచుకుపోయేది మరికొందరు.. రాత్రివేళల్లో దొంగతనంగా దోచుకెళ్లేవారు ఇంకొందరు. మార్గాలు ఏవైనా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక కనిపిస్తే చాలు జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అనుమతుల పేరుతో కొందరు, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంకొందరు.. మార్గాలేవైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. టిప్పర్లు, ట్రాక్టర్లతో వాగుల్లోని ఇసుకను తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోంది. మరోవైపు జనానికి మాత్రం చుట్టూ ఇసుక ఉన్నా సహేతుక ధరల్లో ప్రభుత్వం నుంచి ఇసుక అందడం లేదు. ఇసుక కావాలంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులే చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఇసుకదందా జోరుగా సాగుతోంది.

టాస్క్ ఫోర్స్ బృందాలతో చర్యలు తీసుకుంటున్నామని అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు చెబుతున్నా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. వాగుల్లో నీరు ఖాళీ అయి.. ఇసుక పైకి తేలిందంటే చాలు, నిలువునా దోచుకుని సొమ్ముచేసుకునేందుకు అక్రమార్కులు సిద్ధమై పోతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు, పోలీసులు అండదండలు ఉండటంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.

నారాయణపేట జిల్లాలో మక్తల్ మండలం దాసరిదొడ్డి, వర్కూరు వాగులు ఇసుక దోపిడికి అడ్డాగా మారుతున్నాయి. ఇసుకను తరలించేందుకు నాలుగైదు టిప్పర్లకు అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నకొందరు... ఆ పేరుతో రోజుకు పదుల ట్రిప్పులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో టిప్పరు ధర స్థానికంగా మక్తల్ పట్టణంలో అమ్మకానికైతే రూ.25వేలు పలుకుతోంది. పల్లెలు, ఇతర పట్టణాలకైతే దూరాన్ని బట్టి టిప్పరుకు రూ.30వేల నుంచి రూ.35వేల వరకూ వసూలు చేస్తున్నారు.

పోలీసులు, అధికారులెవరైనా అడిగితే తెచ్చుకున్న అనుమతులు చూపుతున్నారు. అనుమతులు పొందిన టిప్పర్ల ద్వారా ఇసుకను ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకే రవాణా చేయాల్సి ఉంది. కానీ ఉదయం 7గంటల నుంచే రవాణా మొదలవుతోంది. ఎన్ని టిప్పర్లు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి చేరవేస్తున్నారన్న దానిపై అధికారుల నిఘా కరవైంది. దీంతో అక్రమార్కులకు అడ్డే లేకుండా పోయింది.

అనుమతుల పేరుతో టిప్పర్లలో ఇసుక రవాణా ఒక ఎత్తైతే.. ఎలాంటి అనుమతులు లేకుండానే వాగుల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలించడం మరోఎత్తు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం నాగిరెడ్డిపల్లి, ఓబులాపూర్ నక్కల వాగు, మల్లేపల్లి, సోమేశ్వరబండ, కృష్ణా,మాగనూరు మండలాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాలు... కోస్గి మండలంలోని కొత్తపల్లి, మునరిఫా, బోగారం, బిజ్వార్, గుండుమాల్, అమ్లికుంట,మూగిమల్ల సహా మద్దూరు మండలాల్లోని పలు వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా యదేఛ్ఛగా సాగుతోంది.

రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేసి తెల్లారేసరికి ఏమి జరగనట్లే ఉండటం ఈ దందాలో నయా పంథా. ఎవరైనా అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు చూసిచూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో వర్షాలతో వాగులు నిండే అవకాశం ఉండటంతో ఉన్న సమయంలోనే ఇసుకను దోచేందుకు అక్రమార్కులు వ్యూహాత్మకంగా రవాణాకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని వాగులపైనా నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

"ప్రభుత్వం తరుఫున చల్లాన్లు సమర్పించిన వారికే పర్మిషన్​లు ఇస్తున్నాం. ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు." - రాంచందర్ నారాయణపేట ఆర్డీఓ

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అటువైపే చూడని అధికారులు

ఇదీ చదవండి: ఆదిరిపోయే ఆఫర్లలో ఆర్టీసీ 'తగ్గేదేలే'.. ఈసారి డబుల్​ బొనాంజా!!

బాయ్​ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిల కొట్లాట.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.