ETV Bharat / state

రణరంగాన్ని తలపిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రం - ఉద్యమాల గుమ్మంలో ఈసారి గెలుపెవరిదో?

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 10:15 AM IST

Updated : Nov 16, 2023, 7:17 AM IST

Political Heat in Joint Khammam District : ఉద్యమాల గుమ్మం.. ఉమ్మడి ఖమ్మం. ఎత్తుకు పైఎత్తులు, సవాళ్లకు ప్రతి సవాళ్లతో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్‌.. ఈసారి అత్యధిక సీట్లపై గురిపెట్టింది. ముఖ్య నేతల చేరికతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనే లక్ష్యంతో ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కలిసి పోటీ చేస్తున్న బీజేపీ-జనసేన.. గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నాయి. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులిద్దరూ ఉమ్మడి ఖమ్మం నుంచే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Telangana Assembly Elections 2023
Political Heat in Joint Khammam District

రణరంగాన్ని తలపిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రం

Political Heat in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో.. ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. బీఆర్ఎస్‌ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా.. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది. సీపీఎం ఒంటరిగానే 8 స్థానాల్లో పోటీచేస్తోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో నిలిచారు.

ఖమ్మంలో దొంగ ఓట్ల వ్యవహారం - తుమ్మల, పువ్వాడ మధ్య మాటల తూటాలు

పాలేరు, మధిర, సత్తుపల్లి, ఇల్లందు, పినపాక, భద్రాచలంలో పోటీ చేస్తున్న బీజేపీ.. పొత్తులో భాగంగా ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలను జనసేనకు కేటాయించింది. అభివృద్ధి నినాదంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది. కార్యకర్తల దన్నుతో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్.. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి ముఖ్య నేతల చేరికతో మరింత శక్తిమంతంగా మారింది. బీజేపీ-జనసేన, వామపక్ష పార్టీలు... సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

ఖమ్మం జిల్లాకు తోరణంగా ఉన్న పాలేరు గడ్డపై... ఈసారి అసెంబ్లీ పోరు ఆద్యంతం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి ఉద్ధండులు బరిలోకి నిలవడమే ఇందుకు కారణం. బీఆర్ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy), సీపీఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం తలపడుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని.. కందాల ధీమాగా ఉన్నారు.

తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. పాలేరులో పాగా వేయాలనే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలతోపాటు.. తనను గెలిపిస్తే పాలేరు ప్రజలకు పెద్ద పాలేరుగా ఉంటానంటూ ప్రచారం చేస్తున్నారు. తమ్మినేని వీరభద్రాన్ని గెలిపించుకుని ఉనికి ఘనంగా చాటాలని సీపీఎం శ్రేణులు ఉత్సాహం చూపిస్తున్నాయి.

గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట

Political Heat in Khammam : సమఉజ్జీల సమరంతో ఖమ్మం గుమ్మంలో రాజకీయ పోరు రసకందాయంలో పడింది. బీఆర్ఎస్‌ నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ (Minister Puvvada Ajay Kumar).. కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పోరును రక్తికట్టిస్తున్నారు. హ్యాట్రిక్‌పై గురిపెట్టిన పువ్వాడ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తాను పక్కా లోకల్‌ అని.. పదేళ్ల అభివృద్ధి చూసి పట్టం కట్టాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అజయ్‌ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని తుమ్మల నాగేశ్వరరావు ప్రచారపర్వాన్ని ఉరకలెత్తిస్తున్నారు. 2014లో తుమ్మలపై పువ్వాడపై చేయి సాధించగా... ఈసారి ఇద్దరి మధ్య సమరం ఖమ్మంలో రాజకీయం కాక పుట్టిస్తోంది.

Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు

వైరాలో ద్విముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను రాములు నాయక్‌ను తప్పించి.. మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు సీటు కట్టబెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థిగా రాందాస్‌ నాయక్‌ బరిలో ఉన్నారు. ఈసారి హోరాహోరీ పోరు తప్పదంటున్నారు. రాములు నాయక్‌ వర్గీయులు మదన్‌లాల్‌కు ఎంతవరకు సహకరిస్తారోనని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై (CLP Leader Bhatti Vikramarka) .. గులాబీ పార్టీ అభ్యర్థి అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ నాలుగోసారి పోటీ పడుతున్నారు.

ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన భట్టి విక్రమార్క మరోసారి సత్తా చాటాలని ప్రజల్లోకి వెళ్తున్నారు. జడ్పీ ఛైర్మన్‌గా కమల్‌రాజ్‌ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. సత్తుపల్లిలో హ్యాట్రిక్‌ విజయంపై సండ్ర వెంకటవీరయ్య కన్నేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మట్టా రాగమయి బరిలో నిలిచారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీని వీడటం కొంత ఇబ్బందికరంగా మారింది. బీజేపీ నుంచి మరోసారి నంబూరి రామలింగేశ్వరరావు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Political Heat in Khammam District : రసవత్తరంగా ఖమ్మం రాజకీయం.. నువ్వానేనా అంటూ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఢీ

కొత్తగూడెంలో ఈసారి త్రిముఖ పోరు తప్పేలా లేదు. బీఆర్ఎస్‌ నుంచి సిట్టింగు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పొత్తులో భాగంగా కాంగ్రెస్‌-సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao ), ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పోటీలో ఉన్నారు. అసమ్మతి సెగలు, కౌన్సిలర్ల అలకలు అధికార పార్టీకి కొంత ప్రతికూలంగా మారాయి. హస్తం పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్న కూనంనేనికి కాంగ్రెస్‌ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. రాజకీయంగా చాలా కాలం స్తబ్ధుగా ఉన్న జలగం వెంకట్రావు.. సింహం గుర్తుతో ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటారోననే చర్చ నడుస్తోంది.

Political Heat in Yellandu : ఇల్లందులో బీఆర్ఎస్‌- కాంగ్రెస్... సై అంటే సై అంటున్నాయి. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే హరిప్రియనాయక్,.. హస్తం పార్టీ అభ్యర్థిగా కోరం కనకయ్య బరిలో ఉన్నారు. ఎన్నికల వేళ అధికార పార్టీ నుంచి నుంచి కాంగ్రెస్‌కి నేతల వలసలు సాగాయి. హస్తం పార్టీకి సైతం రెబల్స్ బెడద ఉంది. పినపాక నియోజకవర్గంలో పాత ప్రత్యర్థులే ఢీ కొడుతున్నారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా రేగా కాంతారావు, కాంగ్రెస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు తప్పేలా లేదు.

సీతారామ ప్రాజెక్టుతో పాలేరుకు గోదావరి నీళ్లు అందిస్తా : కందాల ఉపేందర్​ రెడ్డి

Telangana Assembly Elections 2023 : అశ్వారావుపేటలో బీఆర్ఎస్‌ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి జారె ఆదినారాయణ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం మద్దతు ఎవరికి ఇస్తే వారు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య హస్తం పార్టీ నుంచి.. భారత రాష్ట్ర సమితి తరఫున తెల్లం వెంకట్రావ్‌ బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు సవాల్‌గా మారాయి. అభ్యర్థుల గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం ఆద్యంతం రంజుగా మారుతోంది.

ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు

ఖమ్మంలో రాజకీయ కాక - సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

Last Updated : Nov 16, 2023, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.