ETV Bharat / state

'మరో బేసిన్‌కు నీటి కేటాయింపు ఉండాలి'

author img

By

Published : Jun 11, 2022, 7:37 AM IST

నదుల అనుసంధానం
నదుల అనుసంధానం

నదుల అనుసంధానంపై రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను అధిగమించడానికి కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇటీవల జరిగిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చలు జరిపారు.

ఉన్న నీళ్లు మాకు సరిపోతాయి.. వేరే బేసిన్‌కు మళ్లించడానికి వీలు లేదు అంటూ నదుల అనుసంధానంపై రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను అధిగమించడానికి కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇటీవల జరిగిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా బేసిన్‌లోని భాగస్వామ్య రాష్ట్రాలకు ట్రైబ్యునళ్లు నీటిని కేటాయించడంతోపాటు ఒక బేసిన్‌ నుంచి ఇంకో బేసిన్‌కు మళ్లించడానికి కూడా కేటాయింపు చేయాలనే కొత్త ప్రతిపాదన వచ్చింది. మహానది నుంచి గోదావరికి నీటి మళ్లింపుపై ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో మహానది ట్రైబ్యునల్‌లోనే జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) భాగస్వామి అయ్యే అంశంపై న్యాయసలహా తీసుకోవాలని నిర్ణయించింది.

మహానది జలాలే కీలకం

నదుల అనుసంధానంలో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి గోదావరిపై ధవళేశ్వరానికి, ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించాలన్నది ప్రతిపాదన. మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధానానికి ఒడిశాలోని మహానది నుంచి మిగులు నీటిని గోదావరికి మళ్లించడం కీలకం. అయితే మహానదిలో మిగులు జలాలు లేవని, మళ్లించడానికి వీలులేదనడంతో పాటు నీటి మళ్లింపు మార్గంపైనా ఒడిశా అడ్డు చెప్పడంతో పలు ప్రత్యామ్నాయాలపై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనం చేస్తోంది.

ఇదే సమయంలో గోదావరి నుంచి నీటి మళ్లింపు జాప్యం కాకుండా ఉండటానికి, కేటాయింపు ఉండీ ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని నీటిని, గోదావరిలో ఉన్న మిగులు జలాలను కలిపి కృష్ణా-పెన్నా మీదుగా కావేరి వరకు 247 టీఎంసీలు మళ్లించే ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చింది. అయితే తమ రాష్ట్రంలో మిగులు జలాలు లేవని, నీటి లభ్యతపై మొదట అధ్యయనం చేయించాలని తెలంగాణ కోరింది. దీంతో ఈ ప్రతిపాదన కూడా పక్కన పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఛైర్మన్‌ వెదిరే శ్రీరాం అధ్యక్షతన జరిగిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో దీని గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర జలసంఘం, జల్‌శక్తి, ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులతో సహా పలువురు జలవనరుల నిపుణలు పాల్గొన్నారు.

178 ఒడిశాకు.. 230 అనుసంధానానికి..

ఈ సందర్భంగా ఒడిశాలో మహానదిపై ఉన్న మణిభద్ర డ్యాంకు 14 కి.మీ ఎగువన బారాముల్‌ వద్ద అనకట్ట నిర్మించి 178 టీఎంసీలు ఆ రాష్ట్రం వినియోగించుకొనేలా, 230 టీఎంసీలు గోదావరిపై ఉన్న ధవళేశ్వరం వద్దకు అనుసంధానం ద్వారా మళ్లించేలా ప్రతిపాదించారు. బారాముల్‌కు పైన ఒడిశా ప్రతిపాదించిన ఆరు ప్రాజెక్టులను కూడా దీనికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం మహానది ట్రైబ్యునల్‌ విచారణలో ఉందని, బేసిన్‌లోని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి మాత్రమే ఇది పరిమితమని, దీనివల్ల గోదావరి బేసిన్‌కు నీటిమళ్లింపు సమస్యగా మారుతుందని, న్యాయపరమైన చిక్కులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ సమయంలో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.డి.మొహ్లి జోక్యం చేసుకొని అంతర్‌ బేసిన్‌లకు నీటిని కేటాయించాలని ట్రైబ్యునల్‌ను కోరడానికి ఇది సరైన సమయమని, భాగస్వామ్య రాష్ట్రాలకు నీటిని కేటాయించినట్లే కొంత నీటిని వేరే బేసిన్‌కు మళ్లించడానికి కూడా కేటాయించాలని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చ జరిగిన తర్వాత మహానది ట్రైబ్యునల్‌లో భాగస్వామి కావడానికి న్యాయసలహా తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఇదే జరిగితే బేసిన్‌లోని రాష్ట్రాలు కొంత నీటిని కోల్పోవాల్సి వస్తుంది. కాంట్రాక్టు డాక్యుమెంట్‌ పారదర్శకంగా, స్పష్టంగా లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యల గురించి కూడా భేటీలో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలపై ఈ సందర్భంగా శ్రీరాం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ప్రాజెక్టులకు 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేటాయింపు జరుగుతోంది. అయితే కరవును, తాగునీటి సమస్యను ఎదుర్కొనే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని ఇందులో జరగాల్సిన మార్పుపై కూడా సమావేశం చర్చించింది.

ఇదీ చదవండి: త్వరలో కేసీఆర్‌ జాతీయ పార్టీ... ఈ నెలాఖరు దిల్లీలో ప్రకటన!!

రాజ్యసభ పోలింగ్​: 8 స్థానాల్లో ఫలితాలు.. భాజపా, కాంగ్రెస్​కు చేరో నాలుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.