ETV Bharat / state

DH Srinivasa Rao on Omicron: జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కేసులు పెరిగే అవకాశం: డీహెచ్

author img

By

Published : Dec 5, 2021, 3:41 PM IST

Updated : Dec 5, 2021, 4:06 PM IST

DH Srinivasa Rao on Omicron : జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కొవిడ్​ కేసులు పెరిగే అవకాశం ఉందని డీహెచ్​ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఒమిక్రాన్​ కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేశామన్న డీహెచ్​.. కొవిడ్​ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

DH srinivas on Omicron
ఒమిక్రాన్​ కేసులపై డీహెచ్​

DH Srinivasa Rao on Omicron: కొవిడ్​ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దాస్తున్నామన్న వార్తలో వాస్తవం లేదని ప్రజారోగ్య సంచాలకులు​ డా.శ్రీనివాసరావు తెలిపారు. తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుందని.. కొవిడ్‌ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమని అన్నారు. ఈ వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని చెప్పారు. కరోనాను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందన్న ఆయన.. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌లు ఉండవని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్​ దృష్ట్యా వ్యాక్సినేషన్​ వేగవంతం: డీహెచ్​

దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. అక్కడ కరోనా కేసులు 8 నుంచి 16 శాతానికి చేరాయని డీహెచ్​ అన్నారు. వీటిలో 75 శాతం ఒమిక్రాన్ కేసులే ఉండగా.. వ్యాధి తీవ్రత తెలిసేందుకు మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. కానీ అక్కడ కేసులు పెరిగినా ఆస్పత్రులో చేరికలు, మరణాలు పెరగడం లేదని వివరించారు. కరోనా కొత్త వేరియంట్‌పై ప్రజల భయాందోళనల నేపథ్యంలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

అక్కడే పరీక్షలు

'విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 900 మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్నారు. వారిలో 13మందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. వారికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలుతుంది. కొవిడ్ నిబంధనలు కాస్త మెరుగుపడ్డాయి.' -శ్రీనివాస రావు, డీహెచ్​

డెల్టా కంటే వేగంగా

New variant Omicron: కొవిడ్​ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని డీహెచ్​ అభిప్రాయపడ్డారు. ఒకట్రెండు నెలల్లో భారత్‌లోనూ కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఇప్పటి వరకు దేశంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అన్నారు. జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఫిబ్రవరిలో భారీగా కేసులు నమోదు కావొచ్చని డీహెచ్​ అభిప్రాయపడ్డారు. డెల్టా కంటే ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. కరోనా మూడో దశను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్న ఆయన.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

100 శాతం వ్యాక్సినేషన్​ దిశగా

'ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేదు. వైరస్‌ సోకితే తీవ్ర ఒళ్లునొప్పులు, తలనొప్పి, నీరసం ఉంటాయి. ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేశాం. నిన్న ఒక్కరోజే 3.7 లక్షల డోసుల టీకా పంపిణీ చేశాం. 92 శాతం మందికి మొదటి డోసు పూర్తి కాగా.. 48 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు లోపు 100 శాతం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని నిర్ణయించాం.' -శ్రీనివాస రావు, డీహెచ్​

ఇదీ చదవండి: Omicron‌ suspected woman : కరోనా వచ్చిందని అనుమానించారు సరే.. ఇన్ని అవమానాలా?

Last Updated :Dec 5, 2021, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.