ETV Bharat / state

Telangana Road accidents today : రక్తమోడిన రహదారులు.. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ముగ్గురి ప్రాణాలు బలి

author img

By

Published : Aug 2, 2023, 12:48 PM IST

Telangana Road accidents
Telangana Road accidents

Telangana Road accidents News ToDay : రాష్ట్రంలో ఇవాళ వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ బాచుపల్లిలో స్కూల్ బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. జనగామ జిల్లాలో ఓ వివాహిత.. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌ వద్ద ఓ మహిళ రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడగా.. అందులో సుమారు 42 మంది చిన్నారులు సురక్షింతగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదాలన్నీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Student Crushed by School Bus in Hyderabad Today : బుడిబుడి అడుగులేసే నాన్నతో కలిసి బడికి బయలుదేరిన ఆ చిన్నారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. హైదరాబాద్‌ బాచుపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. బాచుపల్లిలోని ఇంద్రప్రస్థ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే కిశోర్‌ ఇవాళ ఉదయం ద్విచక్రవాహనంపై కుమార్తెను తీసుకుని ‌పాఠశాలకు బయలుదేరాడు. బాచుపల్లి రెడ్డీస్‌ లేబొరేటరీ వద్దకు రాగానే బైక్‌ అదుపుతప్పి, తండ్రీకూతురు కిందపడిపోయారు. ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ స్కూల్‌ బస్సు రోడ్డుపై పడిపోయిన పాప తలపై నుంచి వెళ్లగా చిన్నారి దీక్షిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Hyderabad School Bus Accident Today : బైక్‌పై నుంచి కిందపడి గాయపడిన తండ్రిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కళ్ల ముందే పాప కిందపడిపోవటం.. అదే సమయంలో వచ్చిన బస్సు చిదిమేయటంతో స్థానికంగా విషాదం నెలకొంది. పాప మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి దిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టి.. స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తేల్చారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టినట్లు గుర్తించారు. స్కూల్‌ బస్‌ డ్రైవర్‌ రహీంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Jangaon Road Accident Today : జనగామ జిల్లా లింగాలగణపురం మండలం కుందారం కెనాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీనివాస్‌-నాగమణి దంపతులు కొడుకు, కోడలు ప్రశాంత్‌-సింధుజతో కలిసి కారులో వెళ్తున్నారు. కుందారం కెనాల్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి, చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో సింధుజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త ప్రశాంత్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీనివాస్‌-నాగమణి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి జనగామ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తరలించారు.

Khammam Road accident Today : ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి వైరా వెళుతున్న స్కూటీని వైరా వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం చెందిన శ్రీకన్య (30) మృతి చెందారు. మరో మహిళ రాణికి తీవ్ర గాయాలయ్యాయి. వైరాలోని ఓ గ్యాస్ గోదాంలో మహిళలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనాస్థలి నుంచి పరారయ్యారు.

school bus overturns in Mahabubabad : మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. తొర్రూరు నలంద ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు 42 మంది విద్యార్థులతో బొడ్నాడ గ్రామానికి వెళ్తుండగా.. అదుపుతప్పి బండరాయిని ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పి ఆ బస్సు పక్కనే ఉన్న వ్యవసాయ భూమూల్లోకి దూసుకెళ్లిన బస్సు బోల్తాపడింది.

డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ డ్రైవర్‌ బస్సును అతివేగంగా నడుపుతున్నాడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అయితే ఈ ప్రమాదంలో విద్యార్థులెవరికీ గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.