ETV Bharat / state

8 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు

author img

By

Published : Jun 2, 2022, 5:00 AM IST

Updated : Jun 2, 2022, 8:22 AM IST

ఎనిమిదేళ్ల ప్రాయాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఈ మారు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరులకు అంజలి ఘటించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు.

ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు
ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు

సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ రెండో తేదీన భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిదో ఏట అడుగుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని, దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తోందన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతిఒక్క తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోష పడాల్సిన సందర్భం అన్నారు.

వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజురోజుకూ గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటోందని సీఎం తెలిపారు. కేంద్రంతో సహా పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు-రివార్డులు, ప్రశంసలే ఇందుకు సాక్ష్యమన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి దేశానికే పాఠం నేర్పుతోందని తెలిపారు. నూతన రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆటంకం కలిగిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

ఈసారి ఘనంగా వేడుకలు..

కరోనా ప్రభావంతో రెండేళ్లుగా రాష్ట్రావతరణ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పబ్లిక్ గార్డెన్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం పబ్లిక్ గార్డెన్స్‌లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. వేడుకలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. గన్ పార్క్, అమరవీరుల స్థూపాన్ని కూడా అలంకరించారు. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు, కూడళ్లను అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులతో భవనాలు, కట్టడాలు కాంతులీనుతున్నాయి.

రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగం..

ఉదయం గన్ పార్క్​లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించి అంజలి ఘటిస్తారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకొని వేడుకల్లో పాల్గొంటారు. 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్స్ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం కేసీఆర్... ఎనిమిదేళ్ల తెలంగాణ ప్రగతిని వివరిస్తారు. అంతర్జాతీయ క్రీడల్లో అద్భుతంగా రాణించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణులు నికత్ జరీన్, ఈషా సింగ్‌లను వేదికపై సన్మానించడంతో పాటు నగదు పురస్కారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్నారు.

సాయంత్రం కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు..

జిల్లాలోనూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, సభాపతులు, చీఫ్ విప్‌లు, విప్‌లు, ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. సాయంత్రం అన్ని జిల్లాల్లో కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో 30 మంది కవులతో సమ్మేళనం నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి..

స్వరాష్ట్ర సంబురాలకు వేళాయే...!!

Last Updated :Jun 2, 2022, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.