ETV Bharat / state

ధరణి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.106 కోట్ల ఆదాయం

author img

By

Published : Dec 20, 2020, 7:04 PM IST

Updated : Dec 20, 2020, 8:34 PM IST

ధరణి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 106 కోట్ల ఆదాయం
ధరణి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 106 కోట్ల ఆదాయం

వ్యవసాయ రిజిస్ట్రేషన్ల పురోగతిపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పురోగతి వివరాలు వెల్లడించింది. ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.106.15 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించింది.

రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ ద్వారా ఇప్పటి వరకు 66,614 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వ్యవసాయ రిజిస్ట్రేషన్ల పురోగతిపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పురోగతి వివరాలు వెల్లడించింది. అక్టోబరు 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌... వ్యవసాయ రిజిస్ట్రేషన్లను అధికారికంగా ప్రారంభించగా నవంబరు 2 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది.

66వేల రిజిస్ట్రేషన్లు...

ఇవాళ్టి వరకు 66,614 వ్యవసాయ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 89,851 లావాదేవీలు జరిగి తద్వారా ప్రభుత్వానికి రూ.106.15 కోట్లు ఆదాయం వచ్చినట్లు వివరించింది. ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌ను 1.35 కోట్లు మంది వీక్షించినట్లు పేర్కొంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు చెందిన మొత్తం తొమ్మిది రకాల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రీషెడ్యూలింగ్ వెసులుబాటు...

ముందస్తుగా స్లాట్లు బుకింగ్‌ చేసుకున్న తరువాత రీషెడ్యూలింగ్ చేసుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్న సర్కారు... ఇప్పటి వరకు 483 దరఖాస్తులు రాగా అందులో 346 దరఖాస్తులకు మాత్రమే ఆమోదించినట్లు పేర్కొంది. మరో 92 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పరిశీలనలో ఉండగా ఇంకో 45 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపింది.

253 మాత్రమే...

ఏజెన్సీ ప్రాంతాల భూములకు చెందిన ఇప్పటి వరకు 253 రిజిస్ట్రేషన్లు మాత్రమే పూర్తయినట్లు వివరించింది. పెండింగ్‌ మ్యూటేషన్లకు చెందిన 18,199 దరఖాస్తులు రాగా తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3.57 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. బ్యాంకర్ల మాడ్యూల్‌, కోర్టు కేసుల మాడ్యూల్‌, ఎన్‌ఆర్‌ఐలకు పట్టాదారు పుస్తకాల జారీకి చెందిన మాడ్యూల్‌ తదితరాలు వాటిలో ఉన్నట్లు వివరించింది.

వారానికి ఒకసారి పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రింటింగ్‌ చేసి పంపిణీ చేసేందుకు వెసులుబాటు కల్పించినట్లు పేర్కొంది. ధరణి పోర్టల్‌ ద్వారా గ్రామ మ్యాప్‌లు, సర్వే నంబర్లు, ఉప సర్వేనంబర్లు చూడడానికి అవకాశం కల్పించింది. జీపీఏ, ఎస్‌జీపీఏకు చెందిన మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది.

ఇదీ చూడండి:టీసీఎస్​ఎస్ అధ్యక్షుడిగా నీలం మహేందర్ ఎన్నిక

Last Updated :Dec 20, 2020, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.