ETV Bharat / state

ప్రస్తుతం జోక్యం చేసుకోలేం.. జీవో నెంబర్​ 1​​పై సుప్రీంకోర్టు

author img

By

Published : Jan 20, 2023, 4:29 PM IST

Supreme Court
Supreme Court

SupremeCourt on GO No.1: ఏపీలో జీవో నెంబర్‌ 1పై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విచారణను ముగించింది. కేసు ప్రామాణికతపై ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టట్లేదని సీజేఐ స్పష్టం చేశారు. ఈనెల 23న విచారణ చేపట్టాలని.. హైకోర్టుకు.. సుప్రీంకోర్టు సూచించింది.

SupremeCourt on GO No.1: ఆంధ్రప్రదేశ్​లో రహదారులపై సభలు, సమావేశాల నిర్వహణపై.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1పై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్​పై.. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసుపై హైకోర్టు సీజే నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. జీవో నెం.1పై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ విచారణ ముగించిన సుప్రీం.. ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషన్‌పై జోక్యం చేసుకోమని వెల్లడించింది.

విచారణను రాష్ట్ర హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపడుతుందని తెలిపింది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్‌ బెంచ్‌ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని తెసియజేసింది. అన్ని అంశాలు ఓపెన్‌గా ఉంచుతున్నట్లు పేర్కొంది. కేసు ప్రామాణికతపై ఇప్పుడే ఎలాంటి విచారణ చేపట్టట్లేదన్న సీజేఐ.. ఈనెల 23న విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించారు.

హైకోర్టులో పిటిషన్​: బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ జనవరి 2వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్​ వన్​ను తీసుకొచ్చింది. రాజకీయ పార్టీల గొంతు నొక్కేందుకు తెచ్చిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 12న హైకోర్టు విచారణ జరిపింది. జీవో నంబర్​ వన్​ను పోలీసు చట్టం సెక్షన్‌ 30కి విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. జీవోను ఈ నెల 23 వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

జీవో నంబర్​ వన్​ ద్వారా బహిరంగ సమావేశాలను నిషేధించలేదని, సహేతుకమైన షరతులు విధించడం, ప్రత్యామ్నాయ స్థలాలు సూచించడంపై పోలీసులకు అనుమతిచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. విచారణ ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకుని జీవో అమలును నిలిపేయడంలో.. హైకోర్టు పొరపాటు చేసిందని స్పష్టం చేసింది. కౌంటరు వేసేందుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఉండాల్సిందని అందులో పేర్కొంది. పౌరుల భద్రత నిమిత్తం తీసుకొచ్చిన జీవో అమలును నిలిపేయాల్సిన అవసరం లేదంది.

అత్యవసర విచారణ జరపాలని సంక్రాంతి వెకేషన్‌ బెంచ్‌ ముందు పిటిషనర్ చేసిన అభ్యర్థనను.. హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. అత్యవసరంగా విచారణ జరిపేందుకు కావాల్సిన వాదనలు ఆ పిల్‌లో లేవని స్పష్టం చేసింది. పాలసీ , పరిపాలనా సంబంధమైన విషయాలను వెకేషన్‌లో విచారించడానికి వీల్లేదంది. వెకేషన్‌ బెంచ్‌ ఆ పిల్‌పై విచారణ జరపకుండా ఉండాల్సిందని పేర్కొంది. రోస్టర్‌ పరిధిలోని వ్యవహారం కాదని స్పష్టం చేసింది.

హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు చట్ట విరుద్ధమైనవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పోలీసు చట్టం సెక్షన్‌ 30కి విరుద్ధంగా ఉందని హైకోర్టు పొరపాటు పడిందని.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయకపోతే.. పోలీసుల నియంత్రణ లేకుండా రహదారులపై రాజకీయ ర్యాలీలు, రోడ్‌షోలు, పెద్ద స్థాయిలో బహిరంగ సభలు నిర్వహిస్తారని తెలిపింది.

తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయిన ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని కోరింది. మరో రెండు రోజుల్లో హైకోర్టులో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో ఈ పిటిషన్‌ను వేసింది.
ఇవీ చదవండి: ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా

ఎయిర్​ ఇండియాకు DGCA షాక్​.. రూ.30 లక్షలు ఫైన్​, పైలట్ లైసెన్స్ సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.