ETV Bharat / state

Building Demolish in Quthbullapur : ఆ భవనం కూల్చివేత పనులు ప్రారంభం...

author img

By

Published : Jun 25, 2023, 8:48 PM IST

Updated : Jun 25, 2023, 10:54 PM IST

Old Building Demolish at Quthbullapur : ఒక్కసారిగా భారీ శబ్ధం.. భూకంపం వచ్చిందేమోనని భయబ్రాంతులకు గురైన నివాసితులు.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని ఓ భవన యజమాని చేసిన నిర్వాకం. అద్దెకు ఉంటున్న వారితో పాటు పక్క భవనంలో ఉన్నవారిని.. స్థానికులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రోడ్డు కంటే ఇల్లు ఎత్తు తక్కువ ఉందని.. దానిని అధునాత సాంకేతికతతో జాకీల సాయంతో పైకి లేపుదామనుకున్న ప్రయత్నం విఫలమైంది. పక్కన ఉన్న భవనం అడ్డులేకుంటే కుప్పకూలి తీవ్ర ప్రాణ నష్ణం వాటిల్లేది.

Old Building Demolish at Quthbullapur
Old Building Demolish at Quthbullapur

Officials Demolishing an Old Building in Quthbullapur : చింతల్ శ్రీనివాసనగర్ చెందిన నాగేశ్వరరావు దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇల్లు.. ప్రస్తుతం రోడ్డు కంటే దిగువగా ఉండటంతో వర్షాకాలంలో వాన నీరంతా ఇంటి లోపలికి వస్తుంది. దీంతో తన ఇంటి కింది భాగంలో గోడ నిర్మాణం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో చూసి తన భవనాన్ని కూడా పైకి లేపాలని భావించాడు.

దీంతో నాగేశ్వరరావు.. తమిళనాడు బిల్డింగ్ లిఫ్ట్ సర్వీస్ అనే సంస్థతో సంప్రదించి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. నిన్న సాయంత్రం సిబ్బంది ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే భవనాన్ని పైకి లేపడానికి హైడ్రాలిక్ జాకీలతో సంస్థ చేసిన ప్రయత్నం విఫలం అయింది. ఇందులో భాగంగానే ఆ భవనం పక్కనే ఉన్న మరో భవనంపై ఒరిగిపోయింది. మరోవైపు అదే భవనంలో నివాసం ఉంటున్న నాలుగు కుటుంబాలు వారి పిల్లల్ని తీసుకుని భయంతో బయటకు పరుగులు తీశారు.

Building Tilts in Quthbullapur : స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఆ భవనాన్ని పరిశీలించి, దానిని కూల్చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అధికారులు కొద్ది సమయం ఇచ్చి ఇంట్లో ఉన్న సామాగ్రి తీసుకోవాలని వారికి తెలిపారు. ఈ నేపథ్యంలో వారు ప్రధాన వస్తువులతో పాటు.. కొంత సామాగ్రిని తీసుకున్నారు. మిగిలిన చిన్న చిన్న వస్తువులు ఇంట్లోనే వదిలేసి.. తీసుకున్న వాటితో నివాసితులు రోడ్లపైకి వచ్చారు. నిన్న రాత్రి చుట్టుపక్కల వారి ఇళ్లలో కాలం గడిపారు.

మరోవైపు శనివారం రాత్రి నుంచి భవనంలో అద్దెకు ఉంటున్న కుటుంబీకులు, చిన్నారులు ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల వారు వారికి ఎలాంటి సాయం చేయకపోవడంతో.. దీనంగా చూస్తూ నిల్చున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. బాధితులకు కావాల్సిన ఆహారంతో పాటు పునరావాసాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ 24 గంటలు గడుస్తున్నా.. అధికారులు వారిని పట్టించుకోకపోవడంతో ఆహారం లేక బాధితులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

"భవనం షేక్ అవుతుందని ఫోన్ చేసి అడిగాం. ఈ పనిని ఆపమని చెప్పాం. నిన్న పనివాళ్లు ఇంటి పిల్లర్‌ను కట్ చేశారు. అప్పుడు ఇంటి యజమాని వాళ్ల అబ్బాయిని అడిగాం. పిల్లర్ మీదనే ఇల్లు ఉంటుదని చెప్పాం. అయినా వినలేదు. అప్పుడు ఆపినట్లయితే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు తామంతా రోడ్డున పడ్డాం. ఇంత జరిగినా యజమాని నుంచి తమకు ఎలాంటి సహకారం లేదు. మంచినీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదు." - భవనంలో అద్దెకు ఉంటున్న కుటుంబీకులు

Building Demolish in Quthbullapur : ఇంటిని పైకి లేపేందుకు ప్రస్తుతం నివాసం ఉంటున్న వారిని.. జూలై 1 వరకు ఖాళీ చేయమని చెప్పడంతో.. నివాసితులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇందుకు 5 రోజుల ముందే.. ఇంట్లో అందరూ ఉన్నప్పుడే.. భవనాన్ని జాకీలతో పైకెత్తే ప్రయత్నం చేశాడని బాధితులు వాపోతున్నారు. ఓ పోర్షన్‌లో ఉన్న కుటుంబం భవనం కుదుపులకు లోను కావడంతో భయబ్రాంతులకు గురయ్యారు.

ఈ క్రమంలోనే మంచంపై నిద్రిస్తున్న పాప ఒక్కసారిగా కింద పడిపోయిందని పాప తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి యజమానిని సంప్రదిస్తే తనకు ఎలాంటి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని.. అధికారులను ప్రశ్నిస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు.

Old Building in Quthbullapur : ఇలాంటి భవనాలకు హైడ్రాలిక్‌తో లేపాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని.. భవనం కింద భూమి సమతలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని.. ప్రస్తుతం భవనం కూల్చివేస్తున్న మాలిక్ ట్రేడింగ్ సంస్థ ప్రతినిధి ఫరూక్ తెలిపారు. కొంతకాలంగా ఈ కాలనీలో వరద నీరు వస్తుండటంతో భవనాల పునాదులు దెబ్బతిన్నాయని.. రోడ్లను కొత్తగా నిర్మించడంతో ఇళ్లు రోడ్డు కంటే ఎత్తు తక్కువగా ఉందని ..ఇదే క్రమంలో భవన యజమాని ఇంటిని పైకి ఎత్తేందుకు ప్రయత్నించాడని స్థానికులు చెబుతున్నారు.

Building Demolish in Quthbullapur : ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మంగతాయారు తెలిపారు. అధికారులు భవనాన్ని పరిశీలించి అనుమతులు ఇస్తారని.. కానీ ఈ భవనానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. భవన యజమానిపై.. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.

పక్క ఇంటి మీదకు ఒరిగిన భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు

ఇవీ చదవండి: లైవ్ వీడియో.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

కూకట్‌పల్లిలో కూలిన భవనం స్లాబ్‌... ఇద్దరు కార్మికులు మృతి

Last Updated : Jun 25, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.