ETV Bharat / state

షాపింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్ నుమాయిష్‌ ఎగ్జిబిషన్.. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే..?

author img

By

Published : Jan 10, 2023, 3:11 PM IST

Numaish Exhibition in Hyderabad: నూతన సంవత్సరం కొంగొత్తగా ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌. రెండేళ్ల విరామం తర్వాత పూర్తి స్థాయి ఎగ్జిబిషన్‌ అట్టహాసంగా మొదలైంది. హైదరాబాద్‌ వాసులకు పండగ ముందే వచ్చేసింది. గతంలో మాదిరిగానే సరికొత్త హంగులతో, రకరకాల వస్తువుల ప్రదర్శనతో ముస్తాబైంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల వస్తువులు నుమాయిష్‌ ప్రదర్శనలో కొలువుదీరాయి. షాపింగ్‌కు కేరాఫ్‌గా ఉండే నుమాయిష్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ ప్రదర్శన వచ్చిందంటే చాలు అన్ని దారులు నాంపల్లివైపే అన్నట్టు ఉంటుంది. అంతలా ప్రజలు ఈ వస్తు ప్రదర్శనకు వస్తుంటారు. హైదరాబాద్‌ వాసులే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు నుమాయిష్‌కు వస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలోనూ అత్యంత ప్రజాదరణ కలిగిన నుమాయిష్‌కు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం.

Numaish Exhibition
Numaish Exhibition

షాపింగ్‌కు కేరాఫ్‌ అడ్రెస్ నుమాయిష్‌ ఎగ్జిబిషన్.. ఈ ఏడాది ప్రత్యేకత ఎంటంటే..?

Numaish Exhibition in Hyderabad: నాంపల్లి నుమాయిష్‌ అంటే తెలియని నగర వాసులే ఉండరు. నూతన సంవత్సరం అంటే నగర వాసులకు మొట్టమొదట గుర్తుకు వచ్చేది ఈ సందడే. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రారంభం రోజే నుమాయిష్‌తో స్వాగతం పలకడం అనవాయితీ. ఈ ప్రదర్శనలో ఏటా ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది దాదాపు 15 వందల స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

దేశం నలుమూలల నుంచి ఎంతో మంది హస్త కళాకారులు, వ్యాపారులు నుమాయిష్‌కు విచ్చేశారు. గుండు పిన్నీసు దగ్గర్నుంచి ఇంట్లో వాడుకునే కుర్చీలు, పెయింటింగ్‌లు, దుస్తులు, ఆహార పదార్థాల వరకు అన్నీ నుమాయిష్‌లో ప్రత్యేకమే. నాణ్యమైన కశ్మీరీ డ్రై ఫ్రూట్స్, శ్రీనగర్‌ నుంచి దుప్పట్లు మైసూరు నుంచి హస్తకళలతో సహా అన్ని ఇక్కడ లభిస్తాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా మైసూరు హస్తకళ వ్యాపారి ఏర్పాటు చేసిన దుకాణం అందరిని ఆకట్టుకుంటోంది.

నుమాయిష్‌ వచ్చిందంటే చాలు సందడి మొదలు: చెక్కపై క్లిష్టమైన బొమ్మల ఆకారాలను సైతం అవలీలగా చెక్కి, ప్రదర్శనకు ఉంచిన ఈ స్టాల్‌ ఈ ఏడాది ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాక శ్రీనగర్‌ నుంచి వచ్చిన పలు డ్రై ఫ్రూట్స్ దుకాణాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చక్కని నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ కావడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నుమాయిష్‌ వచ్చిందంటే చాలు సందడితో పాటు నాంపల్లి వద్ద ట్రాఫిక్‌ జామ్‌లు కూడా ఎక్కువే ఉంటాయి.

అంతేకాక నాంపల్లి ఎగ్జిబిషన్‌కు చేరుకునేందుకు మళ్లీ రాత్రి సమయంలో తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఇక్కట్లు తప్పవు. అందుకోసం ఈ ఏడాది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా హైదరాబాద్‌ మెట్రో నగర వాసులకు కాస్త ఊరట కలిగించే వార్తను అందించింది. నుమాయిష్‌ ఉన్న అన్ని రోజులూ అంటే ఫిబ్రవరి 15 వరకు రోజు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్ల సౌకర్యం అందుబాటులో ఉంచింది. అదే విధంగా నగరంలోని అన్ని చోట్ల నుంచి నుమాయిష్‌కు బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మొత్తంగా ఈ ఏడాది ప్రజలకు అనేక ఏర్పాట్లతో నుమాయిష్‌ నిర్వాహకులు, ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు.

అసలు నుమాయిష్‌ ఎలా ఏర్పడిందంటే..?: ఫతే మైదాన్‌, పరేడ్‌ గ్రౌండ్‌ లాంటి చారిత్రకమైన మైదానాల జాబితాలోనిదే నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ కూడా 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్‌ అక్బర్‌ హైదరీకి పంపించారు. ఆయన ఉస్మానియా పట్టభద్రుల సంఘం నేతలను ఆహ్వానించి వివరాలను తెలుసుకున్నారు.

ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తే పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువుల గురించి సాధారణ ప్రజలకు తెలుస్తుందని, అలాగే నిధులు కూడా సమకూరుతాయని వారు వివరించారు. అనంతరం నివేదికను సంస్థాన పాలకుడు ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు పంపించారు. మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ నుమాయిష్‌ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. అలా మొట్టమొదట 1938లో ప్రారంభమైన నుమాయిష్‌ 10 రోజులే నడిచింది.

హైదరాబాద్‌ స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి, వినియోగదారులను చైతన్యపరచడానికి ఇలాంటి ప్రదర్శన ఒకటి అవసరమన్న ఆలోచన మొదట చేసింది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్‌ గ్రూప్‌. అందులో మీర్‌ అక్బర్‌ అలీ ఖాన్‌, నవాబ్‌ అహ్మదలీ ఖాన్‌, మెహెది నవాజ్‌ జంగ్‌ ముఖ్యులు. 1946 వరకు పబ్లిక్‌ గార్డెన్స్‌లో నుమాయిష్‌ నిర్వహించారు. అప్పుడు 10 రోజుల నుంచి 15 రోజుల వరకు నిర్వహించారు.

స్థలం సమస్య: స్థాపించిన 9 సంవత్సరాల్లో నుమాయిష్‌కు ఎంతో ప్రజాదరణ వచ్చింది. నుమాయిష్‌లో స్టాల్స్‌ పెరగడంతో పబ్లిక్‌ గార్డెన్స్‌లో స్థలం సమస్య ఎదురైంది. దీంతో పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి ఇతర ప్రదేశానికి మార్చాలని సంస్థాన అధికారులు, పట్టభద్రుల సంఘం భావించింది. దీంతో నగరంలోని వివిధ ప్రదేశాలను వారు సందర్శించారు. చివరికి నాంపల్లిలోని సువిశాలమైన 32 ఎకరాల మైదానంలో నుమాయిష్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

అలా 1946 లో అప్పటి హైదరాబాద్‌ ప్రధాని సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ ప్రస్తుత వేదిక మార్చాలని ఆదేశించారు. అప్పటి నుంచి నేటికి అదే ప్రదేశంలో ప్రదర్శన కొనసాగుతోంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం 1948లో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్‌ ఏర్పాటు చేయలేదు. 1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర గవర్నర్‌ జనరల్‌ సీ.రాజగోపాలచారి చేతుల మీదుగా ప్రారంభమైంది.

అప్పుడు నుమాయిష్‌ పేరును ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి 2020 వరకు విరామం లేకుండా ఏటా నుమాయిష్‌ దిగ్విజయంగా కొనసాగింది. కానీ, మధ్యలో కరోనాతో మళ్లీ విరామం పడింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. 2019లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం దష్ట్యా ఈ ఏడాది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు.

ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు: దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారి అండర్‌గ్రౌండ్‌లో 2 భారీ వాటర్‌ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వచ్చిన సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. సందర్శకులు కూర్చునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ వచ్చి ఆనందంగా షాపింగ్‌ చేస్తూ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా గడపటానికి వీలుగా ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయి.

కేవలం నగర వాసులు మాత్రమే కాకుండా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన అతిథులు కూడా నుమాయిష్‌ను సందర్శించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ సొసైటీవారు సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోటమే కాక, నుమాయిష్‌తో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో అనేక రకాల సదుపాయాలను కల్పించడానికి ఉపయోగిస్తున్నారు.

ఎగ్జిబిషన్ సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా 19 విద్యాసంస్థలు నడుపుతోంది. 30 వేల మంది విద్యార్థులను చదివించిన ఘనత ఈ సొసైటీది. ఈ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోంది. 1938లో ప్రారంభమైన నుమాయిష్‌ ఇప్పటికీ నిరాకంటంగా కొనసాగుతోంది. జనవరి వచ్చిందంటే హైదరాబాద్‌లో సంక్రాంతి కన్నా నుమాయిష్‌ సందడే ఎక్కువ ఉంటుంది.

అట్టహాసంగా మొదలైన 2023 నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ఓ పండుగలా సాగుతోంది. ఈ రోజు, ఆ రోజు అనే తేడా లేకుండా ప్రజలు కూడా నుమాయిష్‌ ప్రదర్శన వస్తువులను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా నుమాయిష్‌ ప్రదర్శనకు వెళ్లి రండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.