ETV Bharat / state

KTR: ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో ఏం లాభం జరిగింది..?

author img

By

Published : Jun 17, 2021, 7:51 PM IST

KTR, msme
కేటీఆర్​, ఎంఎస్ఎంఈ

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని పునర్ నిర్వచించి కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలు, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు వీలైనంత ఎక్కువ చేయూత అందించేలా చూడాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR)​ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు.

పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి, ఇప్పటికీ ఏడాదికి పైగా కావస్తోందని కేటీఆర్(KTR)​ అన్నారు. అయితే తెలంగాణలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 80 శాతానికిపైగా ఎంఎస్ఎంఈలు లాక్​డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, 25 శాతానికి పైగా రాబడులను పూర్తిగా కోల్పోయాయని చెప్పారు. ప్యాకేజీలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి గ్యారంటేడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించారని, మార్గదర్శకాలు వెలువడ్డాక అందులో ప్రత్యేక ఆకర్షణ ఏమీ లేదని ఎంఎస్ఎంఈలు భావిస్తున్నాయని మంత్రి వివరించారు.

భారీ ఆర్థిక గ్రాంట్ ఇవ్వాలి

పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను రూపొందించారని, దీంతో ఎంఎస్ఎంఈలు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నాయని కేటీఆర్(KTR) తెలిపారు. ఒక్కో యూనిట్ ఒక్కో విధమైన ఇబ్బంది, సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అన్ని ఎంఎస్ఎంఈలకు ఒకే రకమైన పథకం ద్వారా అవసరాలు తీరే అవకాశం లేదాని, కరోనా సంక్షోభం ద్వారా కలిగిన నష్టాలను భరించేలా ఒక భారీ ఆర్థిక గ్రాంట్ ఇవ్వడం ద్వారా ఎంఎస్ఎంఈలను ఆదుకోవచ్చుని తాను భావిస్తున్నట్లు లేఖలో వివరించారు. సంవత్సరానికి పైగా సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలు ఇవాళ్టికి కూడా సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్, లేబర్ కొరత, మారిన కస్టమర్ల ప్రాధాన్యతల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయన్న కేటీఆర్... ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కూడా అంగీకరిస్తానని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్పస్ ఫండ్ స్కీమ్ మార్గదర్శకాలు విడుదల కాలేదు

రుణ భారంతో సతమతమవుతున్న ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన మరో రెండు పథకాలు దురదృష్టవశాత్తు తెలంగాణలోనే కాకుండా, దేశంలో ఎక్కడా కూడా ప్రారంభమైన పరిస్థితి లేదని అన్నారు. ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన సబార్డినెట్ డెబ్ట్ స్కీం అత్యంత తక్కువ రుణ మొత్తాన్ని అందిస్తోందన్న మంత్రి... సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల వయబిలిటీ పైనా స్పష్టత లేదని పేర్కొన్నారు. అత్యంత తక్కువ రుణం ఆయా ఎంఎస్ఎంఈల అవసరాలకి ఏమాత్రం సరిపోవడం లేదని, ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన కార్పస్ ఫండ్ స్కీమ్ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాలేదన్నారు.

పీఎల్ఐతో పెద్ద కంపెనీలకే ప్రయోజనం

పీఎల్ఐ పథకం కేవలం పెద్ద తయారీ కంపెనీలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉందన్న కేటీఆర్(KTR)... దేశీయ ఎంఎస్ఎంఈలతో కూడిన సప్లై చైన్ ఏర్పాటు చేయాలని భారీ తయారీ కంపెనీలకు ఒక నిబంధన పెట్టడం ద్వారా ప్రయోజనాలను ఆయా ఎంఎస్ఎంఈలతో పంచుకునేలా మార్గదర్శకాలను మార్చాల్సి అవసరం ఉందని తెలిపారు. ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభకాలం స్వల్పకాలమే ఉంటుందని... ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించామని అన్నారు. అయితే కరోనా సంక్షోభం రెండో దశను సైతం దాటి కొనసాగుతోందని, త్వరలోనే కరోనా మూడో దశ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజీని మరోమారు పునర్ నిర్వచించాలని కేటీఆర్ కోరారు. తద్వారా కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలు, ముఖ్యంగా అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంఎస్ఎంఈ రంగానికి మరింత చేయూతనిచ్చే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్... కేంద్ర ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్యాకేజీ విషయంలో ఉన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.