ETV Bharat / state

స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు మరింత సమయం

author img

By

Published : May 9, 2021, 2:46 AM IST

Updated : May 9, 2021, 3:58 AM IST

గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఖాళీలకు ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టనుంది. కరోనా ఉద్ధృతితో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించరాదన్న ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. కొవిడ్ తీవ్రత తగ్గాకే ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.

by elections
స్థానిక సంస్థల ఉప ఎన్నికలు

స్థానిక సంస్థల ఉప ఎన్నికలు

రాష్ట్రంలో పలు సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కొందరు మరణించగా, మరికొందరిపై అనర్హతా వేటు పడగా... ఇంకొందరు రాజీనామా చేశారు. మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 125 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 16 సర్పంచ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క పెద్దపల్లి మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు ఒక జడ్పీటీసీ, 60 ఎంపీటీసీ స్థానాలు సహా 2వేల 288 వార్డు సభ్యుల పదవులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి.

భారీగా పెరుగుతున్న కేసులు

ఆయా స్థానాల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఎస్ఈసీ గతంలోనే కసరత్తు పూర్తి చేసింది. వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అంతా సవ్యంగా సాగితే ఈ నెల మూడో వారంలో ఆయా స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయ్యేది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగానే ఉంది. కొవిడ్ పాజిటివ్ కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల మినీపురపోరు సందర్భంగానే పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైంది.

హైకోర్టు అసంతృప్తి

ఎన్నికలను వాయిదా వేయాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. హైకోర్టును కూడా ఆశ్రయించాయి. న్యాయస్థానం సైతం కరోనా విజృంభణ సమయంలో ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సబబని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో జరిగిన మినీ పురపోరులో నిబంధనల అమలు కోసం ఎస్ఈసీ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. మినీ పురపోరు పూర్తి కాగానే గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల ఖాళీలకు ఎన్నికలు నిర్వహించాలని తొలుత భావించారు.

ఈ పరిస్థితుల్లో సాధ్యం కాదు

కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సబబు కాదన్న అభిప్రాయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. కొన్ని చోట్ల మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం భావ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చిన ఎస్ఈసీ... కొవిడ్ తీవ్రత తగ్గాక ఎన్నికల విషయాన్ని ఆలోచించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: ''వ్యాక్సినేషన్​' బడ్జెట్​ను​ వినియోగించని కేంద్రం'

Last Updated : May 9, 2021, 3:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.