ETV Bharat / state

Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. తెలంగాణలో ఆ పార్టీలు అధికారం చేపట్టేందుకు తొలిమెట్టు

author img

By

Published : Apr 26, 2023, 7:06 AM IST

Karnataka Results effect on TS Assembly Elections 2023: కర్ణాటక రాజకీయం తెలంగాణపైన ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దక్షిణాదిపై కన్నేసిన కాషాయ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకునీ.. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కన్నడ నాట బీజేపీ అగ్ర నేతలు, కేంద్రమంత్రులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

Karnataka elections
Karnataka elections

Karnataka Results effect on TS Assembly Elections 2023: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాషాయ దళం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ప్రణాళిక రూపొందించుకుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను తెలంగాణలో సైతం పర్యటించాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. పలువురు నేతలు కర్ణాటక, తెలంగాణ బోర్డర్​కు సమీపంలో ఉన్న ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా విజిట్ చేసే అవకాశాలున్నాయి.

ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ-కాంగ్రెస్: కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలోనూ పర్యటించడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్​కు జీవన్మరణ సమస్యగా మారాయి. అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ, అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద ఆధారపడే తెలంగాణలో రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్రంలో త్రిముఖంగా ఉన్న రాజకీయం... ఈ ఫలితాలతో ద్విముఖంగా మారే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉండటంతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే బలమైన అభ్యర్థులు కరువయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది: ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్​తో బీఆర్​ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడంలో కమలనాథులు సఫలీకృతమయ్యారు. కొన్ని స్థానాలకు అభ్యర్థులు దొరికిన చాలా చోట్ల లేని పరిస్థితి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఆ ప్రభావం తెలంగాణపైన చూపిస్తుందని రాష్ట్ర నాయకత్వం విశ్వసిస్తోంది. బీఆర్​ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, సీనియర్లు, జూనియర్లుగా విడిపోయి ఎడమోహం పెడ మోహంగా పని చేస్తున్నారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్​లోని అసంతృప్త సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ గూటికి వస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది.

అదే జరిగితే బీజేపీకి భంగపాటు తప్పదు: బీఆర్​ఎస్​లోనూ అసంతృప్త నేతలతో పాటు టికెట్ ఆశిస్తున్న నేతలనూ బీజేపీలో చేర్చుకునేందుకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయనీ యోచిస్తోంది. బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెబుతూ వస్తున్న కాషాయ దండుకు కన్నడ నాట బీజేపీ విజయం కొత్త ఉత్తేజాన్ని ఇవ్వనుంది. ప్రతికూల ఫలితాలు సంభవిస్తే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంతో పాటు బీజేపీపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలోనూ గెలుస్తామనే విశ్వాసంతో పాటు ఉత్తేజాన్ని ఇవ్వనుంది. అదే జరిగితే బీజేపీకి భంగపాటు తప్పదు. ఈ పరిణామాలను అంచనా వేసిన బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ విజయానికి కావాల్సిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.

కన్నడ నాట విజయం.. తెలంగాణలో ప్రభావం: కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే జిల్లాల బాధ్యతలను తెలంగాణ నేతలకు కట్టబెట్టారు. ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, వివేక్ వెంకటస్వామి వంటి ముఖ్య నేతలను ప్రచార పర్వంలోకి దింపారు. గత పది రోజులుగా తమకు కేటాయించిన జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇంటింటింటికి తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కన్నడ నాట ఏ పార్టీ విజయ దుందుభి మోగించిన ఆ పార్టీకి తెలంగాణలో జెండా ఎగురవేసేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.