ETV Bharat / state

విద్యార్థులకు జేఎన్​టీయూ మెగా​ ఆఫర్​.. ఏక కాలంలో రెండు డిగ్రీలకు అవకాశం

author img

By

Published : Nov 13, 2022, 7:41 AM IST

dual degree course
dual degree course

JNTU launched dual degree course: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్‌ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్‌)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

JNTU launched dual degree course: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్‌ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తోపాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్‌)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఐటీ సహా అన్ని ఉద్యోగాలకు విద్యార్థుల్లో అదనపు నైపుణ్యాలను కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుంది.

ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసిన సామర్థ్యంతో కొలువుతోపాటు ప్యాకేజీ ఎక్కువగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల నిర్వహణకు విధి విధానాలను ఈ ఏడాది ఏప్రిల్‌లో యూజీసీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి ఆలోచనల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచే వర్సిటీలో కోర్సును ప్రవేశపెట్టారు.

సిలబస్‌ సిద్ధం: బీబీఏ-డేటా అనలిటిక్స్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. దీనికి సంబంధించి సిలబస్‌ సిద్ధమైంది. కోర్సు బోధన వారానికి ఐదు రోజులు ఆన్‌లైన్‌, ఒకరోజు ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది. రాష్ట్రంలో జేఎన్‌టీయూ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లోని ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ బీబీఏ కోర్సు చేయొచ్చు.

ఎవరు అర్హులంటే..?: కోర్సులో చేరేందుకు బీటెక్‌ మొదటి, రెండు, మూడో ఏడాది విద్యార్థులు అర్హులు. మొదటి, రెండో ఏడాదిలో చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ పూర్తయ్యేలోపే బీబీఏ డిగ్రీ పట్టా అందుకునే వీలుంటుంది. మూడో సంవత్సరంలో చేరిన విద్యార్థులు అదనంగా మరో ఏడాది చదవాలి.

క్రెడిట్ల బదలాయింపు: ఈ విధానంలో క్రెడిట్ల బదలాయింపునకు వీలుంటుంది. ఒక కోర్సులో చదివిన సబ్జెక్టులకు సంబంధించిన క్రెడిట్లను మరో కోర్సుకు బదలాయించుకోవచ్చు. ఉదాహరణకు ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో చదివిన సబ్జెక్టు బీబీఏ రెండో ఏడాదిలో మళ్లీ ఉందనుకోండి.. అప్పటికే ఇంజినీరింగ్‌లో చదివినందున.. బీబీఏలో చదవనక్కర్లేదు. ఇంజినీరింగ్‌లో వచ్చిన క్రెడిట్లు బీబీఏకు బదిలీ అవుతాయి.

"ఒకేసారి రెండు డిగ్రీలు చేస్తే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రాంగణ నియామకాల్లో ప్రాధాన్యంతోపాటు అదనపు క్రెడిట్లు దక్కుతాయి. సమయం వృథా కాకుండా బీటెక్‌ పూర్తయ్యేలోపే రెండు డిగ్రీలు చేతికి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీబీఏలో మరిన్ని కోర్సులు తీసుకురావాలనే ఆలోచన ఉంది".-మంజూర్‌హుస్సేన్‌, రిజిస్ట్రార్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.