'మల్లన్నసాగర్ భూసేకరణ వ్యవహారం - పునరావాసంలో వృద్ధులకూ ప్రత్యేక పరిహారం చెల్లించాల్సిందే'

'మల్లన్నసాగర్ భూసేకరణ వ్యవహారం - పునరావాసంలో వృద్ధులకూ ప్రత్యేక పరిహారం చెల్లించాల్సిందే'
HighCourt Verdict on Mallannasagar Land Acquisition Case : మల్లన్నసాగర్ భూసేకరణ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం పిటిషనర్లకు పరిహారం చెల్లించకుండా.. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించారని పిటిషనర్ల న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. జీవో 120 ప్రకారం కుటుంబానికి మొత్తం పరిహారం చెల్లించామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం పునరావాసంలో వృద్ధులకూ ప్రత్యేక పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
HighCourt Verdict on Mallannasagar Land Acquisition Case : మల్లన్నసాగర్ నిర్మాణంలో (Mallannasagar Project) భాగంగా అందిస్తున్న పునర్మిర్నాణ, పునరావాస పథకంలో.. వృద్ధులకూ ప్రత్యేకంగా పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం వృద్ధులను ప్రత్యేక కుటుంబంగానే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. కుటుంబానికి పరిహారం చెల్లించామంటూ.. తమకు ప్యాకేజీ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన పలువురు వృద్ధులు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై జస్టిస్ ముమ్మినేని సుధీర్కుమార్ విచారణ చేపట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిమిత్తం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలతోపాటు 2,000 ఎకరాలకుపైగా భూములను 2016-19 మధ్య సేకరించారని .. పిటిషనర్ల తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం పిటిషనర్లకు పరిహారం చెల్లించకుండా.. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించారని పేర్కొన్నారు. కుమారులకు పరిహారం చెల్లించామన్న కారణంగా వృద్ధులైన వితంతువులు, భార్య చనిపోయినవారికి చెల్లించడం లేదని ధర్మాసనానికి వివరించారు.
Mallannasagar Land Acquisition Case : ఇల్లు ఉన్న వృద్ధులకు భూసేకరణలో భాగంగా పరిహారం వారిపేరుతోనే చెల్లించారని హైకోర్టుకు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. పునరావాస ప్యాకేజీ కింద మాత్రం వారిని మినహాయించి కుమారుల పేరుతో ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం జీవో 120 కింద రూ.7.5 లక్షలతోపాటు ఇళ్లు మంజూరు చేసిందని ధర్మాసనానికి వివరించారు. కాగా ఎక్కువ మంది 65 ఏళ్లకు పైబడిన వితంతువులు, భార్యను కోల్పోయిన వారు ఉన్నారని.. తమకు ఇళ్లు లేక కుమారులు, బంధువుల ఇండ్లలో నివాసం ఉండాల్సి వస్తోందని అన్నారు. కొందరికి మాత్రమే సొంత ఇళ్లుండగా.. ఉన్నాయని, వాటిని భూసేకరణలో భాగంగా తీసుకున్నారని.. యాజమాన్యం, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారన్న దానితో సంబంధం లేకుండా చట్టప్రకారం పునరావాస బాధితులుగా గుర్తించి పరిహారం చెల్లించాల్సి ఉందని న్యాయస్థానానికి తెలియజేశారు.
Mallannasagar Project Rehabilitation Case : జీవో 120 ప్రకారం కుటుంబానికి మొత్తం పరిహారం చెల్లించామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్కుమార్.. హైకోర్టుకు వివరించారు . కుటుంబం అంగీకారంతోనే పునరావాస ప్యాకేజీ కల్పించినట్లు పేర్కొన్నారు. అలా వద్దనుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి తెలిపారు. కుటుంబానికి 250 గజాల్లో డబుల్ బెడ్ రూం ఇంటితోపాటు రూ.7.5 లక్షలు ఇచ్చామని ధర్మాసనానికి చెప్పారు.
కేంద్ర చట్టం ప్రకారం పరిహారం 100 గజాల్లో సింగిల్ బెడ్రూం ఇళ్లు, రూ.6.50 లక్షలు మాత్రమే ఉంటుందని ఎ.సంజీవ్కుమార్.. న్యాయస్థానానికి తెలిపారు. ఒంటరిగా ఉన్న వృద్ధులకు ప్యాకేజీ చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలను విన్న న్యాయమూర్తి చట్టప్రకారం వృద్ధులకు ప్రత్యేకంగా పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందజేయాలని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించారు.
