ETV Bharat / state

కుండపోత వర్షంతో అతలాకుతలమైన జంటనగరాలు

author img

By

Published : Oct 14, 2020, 8:51 PM IST

కుంభవృష్టితో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. మహానగరం జలదిగ్బంధమైంది. వీధులన్నీ నదులను తలపించాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. నింగీనేలా ఏకమైందా... ఆకాశానికి చిల్లు పడిందా... అనే తీరులో వరుణుడి మహోగ్రరూపానికి... జనజీవనం అల్లకల్లోమైంది. సహాయక చర్యలకు సైతం వీలుకాని విధంగా పరిస్థితి మారటంతో... నగరం చిగురుటాకులా వణికిపోయింది. చెరువులు, నాలాల పరిసరాల ప్రజలు భయం గుప్పిట్లో గడిపారు. వందేళ్లలో నగరంలో ఇది అత్యధిక వర్షపాతంగా అధికారులు తెలిపారు.

heavy rains in hyderabad
కుండపోత వర్షంతో అతలాకుతలమైన జంటనగరాలు

కుండపోత వర్షంతో అతలాకుతలమైన జంటనగరాలు

హైదరాబాద్‌లో కుండపోతతో వర్షం బీభత్సం సృష్టించింది. దాదాపు 1, 500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు కోతకు గురవడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. అపార్ట్​మెంట్ సెల్లార్లన్నీ నీటితో నిండిపోయాయి. సాహితీ అపార్ట్‌మెంట్ సెల్లార్ నీటిలో మునిగి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. శివం రోడ్డులో కూలిన భారీ వృక్షంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

పొంగిపొర్లిన సరూర్​నగర్​ చెరువు

రామంతపూర్- ఉప్పల్ రహదారి వైపు రోడ్లకు అడ్డంగా పలు చోట్ల చెట్లు నేలకూలి ట్రాఫిక్ స్తంభించింది. రామంతపూర్ పెద్దచెరువు, చిన్నచెరువు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకొని ఓవర్ ఫ్లో అవడం వల్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు పొంగి పొర్లటంతో... లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఉప్పల్ నల్లచెరువు కట్టతెగడం వల్ల వరంగల్- హైదరాబాద్ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చైతన్యపురిలో పురాతన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం నీటమునిగింది. భారీ వరదతో సరూర్ నగర్ చెరువు పొంగిపొర్లుతోంది. మీర్​పేట్ పరిధిలో వర్షబీభత్సానికి కాలనీల వాసులు అతలాకుతలమయ్యారు. బడంగ్‌పేటలోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్​ఎఫ్​... వరదలో చిక్కుకున్న 76 మందిని రక్షించింది. హయత్​నగర్​లోని బంజారా, ఆర్టీసీ కాలనీలు జలమయమయ్యాయి. వనస్థలిపురం హరిహరపురం కాలనీలో 300 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి.

నేలకొరిగిన భారీవృక్షాలు..

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో వర్షం దాటికి నేలకొరిగిన భారీ వృక్షాలను జీహెచ్​ఎంసీ సిబ్బంది తొలగించారు. ఎస్​బీహెచ్​ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గల యోగా ఆస్పత్రిలోకి నీరుచేరటం వల్ల విద్యుదాఘాతంతో వైద్యుడు మృతిచెందాడు. కేబీఆర్​ పార్కు రహదారి పూర్తిగా జలమయమైంది. మాదాపూర్‌ శిల్పారామంలో భారీగా వరద నీరు చేరడం వల్ల తాత్కాలికంగా మూసివేశారు. కృష్ణానగర్ ప్రధాన రహదారిపై నీరు నిలవడం వల్ల పలు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. మూసాపేట మెట్రోస్టేషన్ కింద ప్రధాన రహదారి కుంగింది. బేగంపేట నాలా పొంగిపొర్లుతుండటం వల్ల పరిసరాలు జలమయమమ్యాయి. మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో నడుం లోతుకు పైగా నీరు ఉండటం వల్ల బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. యూసుఫ్‌గూడ చౌరస్తా సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకు ట్యాంకులలోకి నీరు చేరింది.

కూలిన గోడ

కూకట్​పల్లి ఆల్విన్ కాలనీలో పరికి చెరువు నాలా వరద ఉద్ధృతికి... పారిశ్రామిక వ్యర్థాలన్నీ ధరణీనగర్ రోడ్లపైకి చేరాయి. ప్రగతినగర్‌లో గోడ కూలిన ఘటనలో ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. కంటోన్మెంట్ ప్రాంతంలోని హస్మత్​పేట నాలా పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మియాపూర్ ప్రకాశ్​నగర్‌లో చెరువు ప్రవాహ ఉద్ధృతికి అమ్మవారి గుడి కుప్పకూలింది. బల్కంపేట- బేగంపేట మధ్య లింక్‌రోడ్డులో రైల్‌ అండర్‌ బ్రిడ్జి నీటమునిగింది.

కొట్టుకుపోయిన వాహనాలు

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పరిధిలోని సీతారాంపురం, సౌజన్యకాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరద ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఓల్డ్‌ బోయినపల్లి వికాస్‌నగర్‌ రాయల్‌ ఎన్‌క్లేవ్‌ను వరదనీరు చుట్టుముట్టడం వల్ల నిత్యావసరాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. న్యూబోయిన్​పల్లిలో వరదలో కొట్టుకువచ్చిన ఓ కారు... కాలనీలో నిలిపి ఉన్న మరో కారుపైకి వెళ్లింది. తార్నాక డివిజన్ లాలాపేటలో నాలా ప్రవాహానికి ఐదు ఇళ్లు కూలిపోయాయి. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలోకి నీరు చేరటం వల్ల వైద్యసేవలు అందక రోగులు అవస్థలకు గురయ్యారు. చర్లపల్లి డివిజన్ ఆఫీసర్ కాలనీ జలదిగ్బంధమైంది. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో వరద ఉద్ధృతంగా ప్రవహించింది.

తల్లీకూతుళ్లు మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ పరిధిలోని ఉమర్‌ఖాన్‌గూడ చెరువు కట్ట తెగటంతో... పదికి పైగా ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. లష్కర్‌గూడ వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని మల్‌శెట్టిగూడలో ఇళ్లు కూలిన ఘటనలో... తల్లీకూతుళ్లు మృతిచెందారు.

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.